తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక లాక్ డౌన్ మోడల్ అవసరం

పాజిటివ్ కేసుల అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. పాత రూల్స్ ను మార్చి సరికొత్త నిబంధనల్ని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరాన్ని యడ్డి సర్కారు గుర్తించింది. ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రంలో రాత్రి వేళలోనే కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా వచ్చే నెల 5 (జులై) నుంచి సరికొత్త లాక్ డౌన్ ను తెర మీదకు తీసుకురావాలని డిసైడ్ చేశారు.

అంతకంతకూ పెరుగుతున్నకేసుల నేపథ్యంలో.. ఆ జోరుకు కళ్లాలు వేసేలా కొత్త జాగ్రత్తలు తీసుకోవాలని నరి్ణయించారు. ఇందులో భాగంగా.. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. జులై 5 తర్వాత నుంచి వచ్చే ఆదివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అత్యవసరాలు తప్పించి.. మిగిలిన పనుల కోసం ప్రజలు బయటకు రాకూడదు. అదే సమయంలో శనివారాలు ఆఫీసులు బంద్ చేయాలని నిర్ణయించారు.

ప్రతి వారంలో ఐదురోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్న నిర్ణయంతో పాటు.. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ విధించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక.. ఆదివారాల్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటిని బంద్ చేయనున్నారు. క్యాబులు.. ఆటోలు.. ట్యాక్సీలు.. బస్సులతో పాటు ఎలాంటి వాహనాల్ని రోడ్ల మీదకు అనుమతించరు.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నట్లే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూఈ సరికొత్త లాక్ డౌన్ ను విధించాల్సిన అవసరం ఉంది. సెలవు రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. కమ్యునిటీ స్ప్రెడ్ కు అవకాశం లేకుండా చేస్తుందని చెప్పక తప్పదు. మరి.. కర్ణాటక మోడల్ ను రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎప్పటికి గుర్తిస్తారో..?