అప్పట్లో ఓ దర్శకుడుండేవాడు.. అతణ్ని పిలుస్తున్నారట

ఈ ఏడాది మలయాళంలోనే కాదు.. సౌత్ ఇండియలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజు మీనన్ కాంబినేషన్లో దర్శకుడు సాచీ రూపొందించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత వంశీ సొంతం చేసుకున్నాడు. అప్పట్నుంచి ప్రధాన పాత్రల కోసం, అలాగే దర్శకుడి కోసం వేట సాగుతోంది. నటుల వేట ఒక దశ దాటాక కొలిక్కి వచ్చి రవితేజ, రానా దగ్గుబాటి ఖరారైనట్లు తెలిసింది. ఐతే దర్శకుడి సంగతి తేలడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. ముందు సుధీర్ వర్మ పేరు వినిపించింది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎవ్వరూ ఖరారవ్వలేదు.

తాజా సమచారం ప్రకారం.. ఇప్పుడు యువ దర్శకుడు సాగర్ చంద్రను సంప్రదిస్తున్నారట. ‘అయ్యారే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాగర్.. నాలుగేళ్ల కిందట చివరగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే మంచి సినిమా తీశాడు. అది అప్పట్లో చర్చనీయాంశమైంది. శ్రీ విష్ణు లాంటి చిన్న హీరో నటించడం వల్ల కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. ఒక స్టార్ నటించి ఉంటే పెద్ద రేంజికి వెళ్లేదీ చిత్రం అనడంలో సందేహం లేదు. అంత మంచి సినిమా తీసినా.. ఇప్పటిదాకా మరో అవకాశం దక్కించుకోలేకపోయాడు సాగర్.

వరుణ్ తేజ్‌తో ఓ సినిమా కోసం ప్రయత్నించాడు కానీ వర్కవుట్ కాలేదు. అతణ్ని ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ కోసం అడుగుతున్నారట. అన్నీ కుదిరితే అతనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశముంది. ఇద్దరు రచయితలతో స్క్రిప్టు రెడీ చేశారని.. సాగర్ దర్శకుడు ఖరారైతే ఆగస్టులో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారని సమాచారం.