ఏపీ డీజీపీ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?

కొన్నిసార్లు అంతే. వ్యవస్థలోని కొందరు చేసే తప్పులకు అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఇరుకున పడుతుంటారు. తాజాగా అలాంటిదే ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర హైకోర్టుకు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా కోర్టు హాజరై.. న్యాయమూర్తి ముందు సమాధానం చెప్పాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. రూల్ బుక్ లోని నిబంధనల్ని పాటించాలి. కానీ.. ఆ సమయంలో ముందు వెనుకా చూసుకోవటం చాలా అవసరం. అలాంటివాటి విషయంలో కరకుగా వ్యవహరిస్తామంటే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి.. ఇలాంటి సీన్లే తెర మీదకు వస్తాయని చెబుతున్నారు.

వివిధ కేసులకు సంబంధించిన వాహనాల్ని స్వాధీనం చేసుకుంటున్న ఏపీ పోలీసులు.. తిరిగి వాటిని యజమానులకు తిరిగి ఇచ్చే విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఏపీ పోలీస్ బాస్ కు ఇప్పుడు తలనొప్పిగా మారింది. దీనిపై కోర్టుకు వచ్చిన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా పోలీసు శాఖ ఇచ్చిన సమాధానంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక ఉత్తర్వు జారీ చేశారు. ఏపీ డీజీపీ స్వయంగా కోర్టు ముందుకు రావాలని పేర్కొన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు కట్టడి ప్రాంతాల్లో ఉండటంతో వాటిని అథారిటీ ముందు హాజరు పర్చలేకపోతున్నామని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కోర్టులో ఏజీ చేసిన వాదనకు న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. తెలంగాణ నుంచి రహస్యంగా ఏపీలోకి భారీగా మద్యాన్ని తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగాపోలీసులు చెబుతున్నారు.

ఆ వాదనలో నిజమెంత ఉందన్న విషయాన్ని చూస్తే.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాక మానదు. ఎందుకంటే.. ఇటీవల ఉయ్యూరు నుంచి ఒక వ్యక్తి పన్నెండు బీర్ సీసాల్ని తన కారులో తీసుకురావటంతో పోలీసులు అతన్ని అడ్డుకొన్నారు. రూల్ ప్రకారం కేవలం మూడు బాటిళ్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఇలాంటి తప్పులపై ఫైన్ విధిస్తే సరిపోతుంది. కానీ.. ఏపీ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా అతడు ప్రయాణిస్తున్న రూ.12లక్షల విలువైన కారును సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో సదరు యజమానికి మండింది. పన్నెండు బీరు సీసాల విలువ ఎంత? తన కారు విలువ ఎంత? అన్న ప్రశ్నను సంధిస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయక.. తెలిసి తెలియక చేసే తప్పులకు జరిమానా విధిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా వాహనాల్ని సీజ్ చేసి.. దాని నిర్వహణను పట్టించుకోకపోవటాన్ని యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసుల్లో వేల మందిని అరెస్టు చేశారు. 4,900 వాహనాల్ని సీజ్ చేశారు. దీంతో.. వారి యజమానులు గొల్లుమంటూ.. కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి కేసుల విచారణలోనే ఇప్పుడు హైకోర్టు ఎదుటకుఏపీ డీజీపీ స్వయంగా రావాల్సిన అవసరం ఏర్పడటం గమనార్హం.