కేసీఆర్ ‘పీవీ’ స్తోత్రం విని తీరాల్సిందే

కొందరి రాజకీయం చూస్తే ముచ్చటేస్తుంది. అతడు సినిమాలో హీరో మహేశ్ బాబు పొలం దగ్గర చేసిన ఫైట్ ను విలన్ తనికెళ్లభరణి వర్ణించినట్లుగా.. ఒక క్రమపద్దతిలో చేసే తీరుకు ఫిదా కావాల్సిందే. అవసరానికి మించిన దూకుడు ప్రదర్శించకుండా.. వైనంగా కొట్టుకుంటూ పోయే తీరుకు రాబోయే రోజుల్లో రాజకీయ పాఠ్యాంశంగా మారుతుందని చెప్పక తప్పదు.

మహానుభావుడు పీవీ నరసింహరావును తెలుగు వారంతా గౌరవించాల్సిందే. దేశానికి చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు కానీ.. నయా భారతం ఎలా ఉండాలో డిసైడ్ చేసింది మాత్రమే ఆయనే అని చెప్పాలి. ప్రజాదరణ లేకున్నా ప్రధాని పదవిలో సమర్థుడైన వాడు కూర్చుంటే దేశ గతి ఎలా ఉంటుందో చేతల్లో చూపించిన రాజకీయ నేతగా చెప్పాలి. సోనియాగాంధీ ఏ మాత్రం ఇష్టపడని ఆయన్ను.. కారణం లేకుండానే దూరం పెట్టేసే కాంగ్రెస్ నేతలకు షాకుల మీద షాకులు ఇచ్చే పని మొదలుపెట్టారు కేసీఆర్.

తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ.. తర్వాత కానీ అవసరానికి పీవీ పేరును తెర మీదకు తీసుకొచ్చే గులాబీ బాస్.. తాజాగా మరోసారి ఆయన్ను స్మరించుకున్నారు. అందుకు పీవీ శతజయంతిని వేదికగా చేసుకున్నారు. తాజాగా పీవీ నరసింహరావు శతజయంతిని ఏ రీతిలో నిర్వహించాలన్న విషయాన్ని ఒక ప్రణాళిక రూపంలో ప్రకటించిన వైనం చూస్తే.. ప్రాంతాలకు అతీతంగా తెలుగోళ్లంతా ఫిదా కావాల్సిందే.

పీవీ గొప్పతనాన్ని చెబుతూనే.. అలాంటి గొప్ప నేతను తలవని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉడికిపోయేలా కేసీఆర్ ప్లాన్ ఉందని చెప్పాలి. ఎప్పటిలానే పీవీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలన్న డిమాండ్ చేసిన కేసీఆర్.. పనిలో పనిగా ఈసారి తానే స్వయంగా ప్రధాని మోడీ వద్దకు వెళ్లి తన డిమాండ్ ను ఆయన ఎదుట పెడతానని చెప్పటం చూస్తే.. కేసీఆర్ రాజకీయ చాణక్యం అదిరేలా ఉందని చెప్పాలి.

ఓపక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికార పక్ష నేతలు.. తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతున్న వేళ.. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాటలు ఉండటం గమనార్హం. పీవీ శతజయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ స్థాయి సమావేశాలకు రాష్ట్రపతి.. ప్రధానికి ఆహ్వానం పలుకుతామని చెప్పటం ద్వారా తన తెలివి ఎంతన్న విషయాన్ని మరోసారి అందరికి అర్థమయ్యేలా చేశారు. అంతేకాదు.. పీవీ గొప్పతనం గురించి ఆయన తాజాగా చెప్పిన మాటలు వింటే.. ఇంత ప్రముఖుడ్ని కాంగ్రెస్ నేతల్ని ఎందుకు మిస్ చేసుకుందున్న భావన కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు.

‘‘దేశాన్ని విభిన్న రంగంల్లో పీవీ అందించిన విశిష్ట సేవల్ని గొప్పగా తలుచుకునేలా శత జయంతి ఉత్సవాల్ని ఏడాది పొడువునా నిర్వహిస్తాం. సర్వేల్ లో మొదటి గురుకుల విద్యాలయం ప్రారంభించారు. దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది ఆయనే. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. బిల్ క్లింటన్.. జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు..మాజీ ప్రధానులు.. మంత్రులతో ఆయనకు అనుబంధం ఉంది. వారి అభిప్రాయాల్ని సేకరించాలి. వారిని ఇప్పుడు నిర్వహించే ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలి. ఉత్సవాలను నిర్వహించేందుకు రూ.10 కోట్ల నిధుల్ని తక్షణమే విడుదల చేస్తున్నాం. రానున్న రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తాం’’ అని చెప్పే మాటల్ని చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే.

పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఎలా నిర్వహించాలనే దానిపై సమీక్ష పెట్టిన కేసీఆర్.. భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఆయన మాటల్ని చూస్తే.. పీవీ లాంటి నేతను కాంగ్రెస్ నేతలు మిస్ చేసుకోవటం ఎంత తప్పన్న భావన కలిగేలా చేయటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగేలా ఆయన ప్లాన్ ఉందని చెప్పక తప్పదు. ఏదైనా అంశంపై కేసీఆర్ రివ్యూ పెట్టారంటే అదెంత సేపు ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి పరిస్థితే ఉంది. ఈ రివ్యూలో తీసుకున్ననిర్ణయాలు చూస్తే..పీవీకి ఇంతకు మించిన ఘన నివాళి ఎవరూ చేయలేరన్న విధంగా ఉందని చెప్పక తప్పదు.

పీవీకి భారత రత్న ఇవ్వాలని మంత్రివర్గం..అసెంబ్లీలో తీర్మానం చేస్తామని.. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి కోరుతానని.. హైదరాబాద్.. వరంగల్.. కరీంనగర్.. వంగరలతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ పీవీ కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పారు. ఆయన పేరుతో స్మారక పురస్కారాలు అందజేస్తామని చెప్పిన ఆయన.. పీవీ రాసిన పుస్తకాల్ని మళ్లీ ప్రింట్ చేసి విడుదల చేయాలన్నారు.

ల్రైబరీలకు.. విద్యా సంస్థలకు.. ప్రముఖులకు ఉచితంగా అందజేయాలన్న కేసీఆర్.. పీవీతో గడిపిన వారందరిని ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయన గొప్పతనం తెలిసేలా దేశ వ్యాప్తంగా ఢిల్లీ.. కోల్ కతా.. చెన్నై.. బెంగళూరులో హోర్డింగులు పెట్టాలని.. హైదరాబాద్ లో అయితే కనీసం వంద చోట్ల ఏర్పాటు చేయాలన్నారు.

జూన్ 28న హైదరాబాద్ లో నిర్వహించే పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని.. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో ఆయన జయంతి వేడుకలు జరుగుతాయని.. వాటిని మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తారని చెప్పటం గమనార్హం. అంతేనా.. రామేశ్వరంలో ఎలా అయితేకలాం మోమోరియల్ మాదిరే హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని చెప్పటం చూస్తే.. కేసీఆర్ సారు వారి పీవీ స్తోత్రానికి ఫిదా కావాల్సిందే ఎవరైనా.