తెలంగాణ టు ఏపీ.. వైకాపా ఎమ్మెల్యేకు కరోనా

కరోనా మహమ్మారికి చిన్నా పెద్దా.. రాజు పేద అని తేడాలేమీ ఉండట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులను ఆ వైరస్ పలకరించింది. ఏకంగా బ్రిటన్ ప్రధానే కరోనా బాధితుడిగా మారారు. మన దేశం విషయానికి వస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని బారిన పడ్డారు. తమిళనాట ఓ ఎమ్మెల్యే సైతం కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వాళ్లు చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలోనూ తొలిసారిగా ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఆయనే శ్రీనివాసరావు. ఏపీలో అత్యంత ఆలస్యంగా కరోనా బారిన పడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఈయన. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గానికి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ముందుగా ట్రూనాట్‌ టెస్ట్‌లో ఎమ్మెల్యేకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆ తర్వాత నిర్వహించిన టీపీసీఆర్‌ పరీఓలోనూ ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకే కాదు.. తన గన్ మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో శ్రీనివాసరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఈ నెల 10న అమెరికా నుంచి స్వస్థలానికి వచ్చారు. అమెరికా నుంచి వచ్చాక పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. కానీ తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. తాజా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో ఎమ్మెల్యే శ్రీనివాసరావు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. ఇక్కడి నుంచే వైద్యుల సూచనతో చికిత్స పొందుతోంది. ఎమ్మెల్యే గన్‌మ్యాన్‌ను కూడా హోం క్వారంటైన్లో ఉంచే చికిత్స చేయిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా, ఇంకా వేర్వేరు సమయాల్లో ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఇప్పుడు ఆందోళన నెలకొంది.