రాధేశ్యామ్.. ఎంతెంత దూరం?

కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక ఇండియాలో విడుదలైన అతి పెద్ద చిత్రం ‘రాధేశ్యామ్’యే. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రభాస్ ఏంటి ప్రేమకథ చేయడం ఏంటి అని.. ప్రోమోలు అంతంతమాత్రంగా ఉన్నాయని మద్యలో ఎన్ని నెగెటివ్ కామెంట్లు వినిపించినా.. రిలీజ్ టైంకి ఈ చిత్రానికి మంచి హైపే వచ్చేసింది. ఈ సినిమాను రిలీజ్ చేసిన థియేటర్ల సంఖ్య.. దీనికి జరిగిన బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. ప్రభాస్ స్టార్ డమ్ ఏంటన్నది అర్థమవుతుంది.

నిస్సందేహంగా ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాసే అని అందరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించింది. ఐతే ‘రాధేశ్యామ్’ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినా తట్టుకుని తొలి వీకెండ్లో ఈ చిత్రం గట్టి ప్రభావమే చూపింది. చిత్ర నిర్మాతల లెక్కల ప్రకారం ‘రాధేశ్యామ్’ తొలి వారాంతంలో రూ.151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ రూ.100 కోట్లకు చేరువగా ఉంది.ఈ లెక్కలు ఘనంగానే కనిపిస్తున్నా.. ‘రాధేశ్యామ్’ మీద బయ్యర్లు పెట్టిన పెట్టుబడుల ప్రకారం చూస్తే ఇవి మరీ పెద్ద నంబర్లేమీ కావు. ఫుల్ రన్లో రూ.200 కోట్లకు పైగా షేర్ రాబడితే తప్ప ‘రాధేశ్యామ్’ బ్రేక్ ఈవెన్ అవ్వదు.

వీకెండ్ వరకు, తెలుగు రాష్ట్రాల్లో డివైడ్ టాక్‌ను తట్టుకుని మంచి వసూళ్లే రాబట్టినా.. సోమవారం నుంచే ఈ సినిమాకు అసలు పరీక్ష ఎదురు కానుంది. కేవలం ఏపీ, తెలంగాణ వరకే ఈ చిత్రం రూ.105 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో షేర్ రూ.60 కోట్లకు చేరువగా ఉంది అంతే. ఇంకా 40-45 కోట్ల షేర్ అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ నెల 25న ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే వరకు ఛాన్స్ ఉన్నప్పటికీ.. వీకెండ్ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర థియేటర్లకు రప్పిస్తుందన్నది సందేహంగా మారింది.

మాస్ టచ్, హీరో ఎలివేషన్లు ఉన్న సినిమా అయితే.. అభిమానులు, మాస్ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా చూస్తారు. కానీ ఈ సినిమా ఆ కోవకు చెందింది కాదు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు రావడం కూడా వీకెండ్ తర్వాతి వసూళ్లలో కీలకం. మరి వాళ్లు ఏమేర ఆసక్తిని ప్రదర్శిస్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల అవతల అయితే ‘రాధేశ్యామ్’ బాగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్లో ‘రాధేశ్యామ్’ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.