మరోసారి మోగిన రాజీనామా ‘గంటా’

తాజాగా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోరు పెంచిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ రాశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానని, అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నానని లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని అన్నారు.

అయితే, స్పీకర్ మాత్రం గంటా రాజీనామాను అమోదించలేదు. వాస్తవానికి ఈ తరహా రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటారు.  కానీ, ఏడాదిగా గంటా రాజీనామాను పెండింగ్ లో పెట్టడం వెనుక వేరేకారణాలున్నాయని తెలుస్తోంది. గంటా రాజీనామా ఆమోదించి.. 6 నెలల్లో ఉపఎన్నికలు వస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరమని తమ్మినేని అనుకుంటున్నారట. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ కు డ్యామేజీ ఎక్కువగా అయిందని, అందుకే గంటా రాజీనామాపై మీనమేషాలు లెక్కిస్తున్నారని టాక్ వస్తోంది. మరోవైపు, గంటా రాజీనామా వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖ ఉద్యమాన్ని సాకుగా చూపి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకే గంటా స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా గంటా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన సమయంలో హఠాత్తుగా యాక్టివ్ కావడం కూడా ఆ అనుమానాలకు ఊతమిస్తోంది. నిజంగా విశాఖ ఉక్కే గంటా ఎజెండా అయితే…విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేతల పోరులో గంటా ఏనాడూ పాల్గొనలేదు. అంతేకాదు, ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర నేతల భేటీకీ గంటా డుమ్మా కొట్టారు. చాలాకాలంగా సైలెంట్ గా ఉంటున్న గంటా… ఇపుడు హఠాత్తుగా మరోసారి తన రాజీనామా సంగతి ఏమిటని స్పీకర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.