కరోనా చేసిన ఒక గొప్ప పని

కరోనా వైరస్ అనగానే దాని చెడు ప్రభావాల గురించే మాట్లాడుతున్నారందరూ. కానీ ఈ వైరస్ వల్ల కొంత మంచి కూడా జరుగుతోంది. ఈ భూమి కేవలం తనకొక్కడికే సొంతం అని విర్రవీగే మానవుడికి అప్పుడప్పుడూ ప్రకృతి పాఠం చెబుతుందని కరోనా వైరస్ ద్వారా తేలింది. ఈ వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాకౌట్ అయిపోవడం.. జనాలు ఇళ్లలోంచి బయటికి రాక అన్ని కార్యకలాపాలూ ఆగిపోవడంతో.. ఇన్నాళ్లూ మనిషి ధాటికి తట్టుకోలేక మరుగులోకి వెళ్లిపోయిన వివిధ రకాల జంతు జాలం బయటికి వస్తుండటం విశేషం.

తాజాగా టాలీవుడ్ హీరో నాని తన ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న చెట్టు మీదికి ఓ పక్షి వచ్చి గూడు పెట్టిన దృశ్యం చూపించి, కరోనా వల్ల జరిగిన మంచి మార్పును నెటిజన్లకు తెలియజేశాడు. దీన్ని మించిన గొప్ప విషయాలు చాలా జరిగాయి. కరోనా ధాటికి అల్లాడిపోతున్న ఇటలీలో డాల్ఫిన్‌లతో పాటు సముద్ర జీవులెన్నో పోర్టులకు సమీపంలో నీటిపైన తేలియాడుతూ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అలాగే మెక్సికోలో అయితే పెంగ్విన్ పక్షులు ఎయిర్ పోర్టులోకి వచ్చేశాయి. సింగపూర్లో బాతులు జనాలు తిరిగే కెనాల్స్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మరో దేశంలో నిప్పు కోళ్లు రోడ్ల మీదికి వచ్చి ఏ భయం లేకుండా తిరిగేస్తున్నాయి. ఇంకా పలు దేశాల్లో అనేక జీవ రాశులు జన సంచారం నిలిచిపోయిన ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తుండటం చూసి.. ఈ ప్రపంచం కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదని.. మిగతా జీవరాశులకూ వాటా ఉందనే విషయాన్ని ప్రకృతి చెప్పకనే చెబుతోందన్నది స్పష్టం.