వాడికి నరకం చూపిస్తా: బెల్లంకొండ సురేష్

టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్‌కు ఇండస్ట్రీలో ఆర్థిక వివాదాలు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు ఈ వివాదాల్లో ఆయన పేరు నానింది. ఇప్పుడు మరోసారి ఆయన ఓ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. శరణ్ అనే ఫైనాన్షియర్ సురేష్ మీద చీటింగ్ కేసు పెట్టడం తెలిసిందే. 2018లో తాను ఓ సినిమాకు రూ.85 లక్షలు ఫైనాన్స్ చేశానని.. ఎన్నిసార్లు అడిగినా సురేష్ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదని శరణ్ ఆరోపిస్తున్నాడు.

ఈ కేసుకు సంబంధించి సురేష్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో శరణ్‌కు సురేష్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘వాడికి నరకం చూపిస్తా’’ అని సురేష్ పేర్కొనడం గమనార్హం. తనను చెడుగా చూపించడానికే ఈ ఆరోపణలు చేశారని.. తన పంచ ప్రాణాలైన తన పిల్లల జోలికి వచ్చారు కాబట్టి శరణ్‌కు ఊరికే వదిలి పెట్టనని సురేష్ అన్నాడు. శరణ్ మీద పరువు నష్టం దావా వేస్తానని.. అతణ్ని లీగల్‌గానే ఎదుర్కొంటానని.. చట్ట విరుద్ధంగా ఏమీ చేయనని సురేష్ పేర్కొన్నాడు.

తమ కుటుంబాన్ని వేధించడానికే ఇంకో కుటుంబం కుట్ర పూరితంగా ఈ కేసు పెట్టించిందని సురేష్ ఆరోపించాడు. సురేష్‌కు గతంలో కూడా ఇలాంటి ఫైనాన్స్ వివాదాలు చాలా ఉన్నాయి. ఆ వివాదాల కారణంగానే ఒక దశలో ఆయన సినిమాల నిర్మాణం ఆపేయాల్సి వచ్చింది. వేరే నిర్మాతల్ని ముందు పెట్టి తెర వెనుక తనే డబ్బులు పెడుతూ కొంత కాలం బండి నడిపించాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సాక్ష్యం, జయ జానకి నాయకా లాంటి భారీ చిత్రాలకు అంతేసి బడ్జెట్లు పెట్టారంటే అందుక్కారణం సురేష్ తెర వెనుక నుంచి చేసిన సాయమే కారణమంటారు. ఐతే ఈ మధ్య మళ్లీ ఆయన తిరిగి ప్రొడక్షన్లోకి అడుగు పెట్టడానికి చూస్తున్నడు. శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అది ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు.