భీమ్లా నాయక్.. సాధించాడుగా

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది ఉన్నట్లుండి సినిమా టికెట్ల రేట్లు ఎందుకు తగ్గాయో అందరికీ తెలుసు. ఓవైపు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతుంటే. దశాబ్దం కిందటి ధరలకు సంబంధించి జీవోను బయటికి తీసి అత్యవసరంగా అమల్లోకి తెచ్చారు. అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమాను దెబ్బ కొట్టడానికన్నది స్పష్టం. ఈ రోజుల్లో ఈ రేట్లేంటని అడిగితే పేదలకు తక్కువ ధరలో సినీ వినోదం అందించడానికే ఇలా చేస్తున్నామని, దీన్ని తప్పుబడతారా అని ఎదురు దాడి చేశారు.

కట్ చేస్తే ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుతూ కొత్త జీవో ఇచ్చారు. ఇప్పుడు పేదలంతా ఉన్నట్లుండి ఎలా ధనవంతులు అయిపోయారు.. పెంచిన రేట్లతో వాళ్లు సినిమా చూడ్డం ఎలా అంటే సమాధానం చెప్పేవాళ్లు లేరు. కేవలం పవన్ కళ్యాణ్‌ను దెబ్బ కొట్టడం, అలాగే ఇండస్ట్రీ అంతా తమ ముందు సాగిల పడేలా చేయడానికే ఈ టికెట్ల ధరల డ్రామా నడిచిందన్నది స్పష్టం. ఏపీ ప్రభుత్వమే సమస్యను సృష్టించి, దాన్ని పెంచి పెద్దది చేసి, చివరికి కాస్త ఉపశమనం కలిగించడం ద్వారా సమస్య పరిష్కరించినందుకు ఇండస్ట్రీ తరఫు నుంచి అభినందనలు అందుకుంటుండటం విడ్డూరం.

ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. జగన్ ముందు తలొంచలేదు. తన సినిమాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త టికెట్ల ధరల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఇవ్వరని అర్థం చేసుకుని, గత నెలలోనే సినిమాను రిలీజ్ చేయించేశాడు. సెకండ్ వీకెండ్ కూడా అయ్యాక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిందని రూఢి చేసుకున్నాక కొత్త రేట్లతో జీవోను రిలీజ్ చేసింది. ఐతే ‘భీమ్లా నాయక్’ పనైపోయిందని అంతా అనుకున్నారు కానీ.. ఆ సినిమా ఇంకా ప్రభావం చూపుతోంది. మూడో వీకెండ్లోనూ ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ సినిమాను హోల్డ్ చేశారు.

ఇప్పుడు ‘రాధేశ్యామ్’కు డివైడ్ టాక్ రావడం ‘భీమ్లా నాయక్’కు కలిసొచ్చే అంశమే. ‘రాధేశ్యామ్’ పక్కా క్లాస్ మూవీ కావడంతో మాస్, హీరో ఎలివేషన్లు ఉన్న ‘భీమ్లా నాయక్’కు ప్లస్సే. దీంతో వీక్ డేస్‌లో వీక్ అయిన ఈ చిత్రం వీకెండ్లో పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే ఎన్ని థియేటర్లలో సినిమా నడుస్తోందన్నది పక్కన పెడితే.. ‘భీమ్లా నాయక్’కు కొత్త రేట్లు వర్తించకూడదని పట్టుబట్టిన జగన్ సర్కారు ఆశ నెరవేరలేదు. కొత్త రేట్లతోనే ఇప్పుడు మూడో వీకెండ్లో ఓ మోస్తరు స్క్రీన్లలో సినిమా నడుస్తోంది. చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తోంది. ఈ రకంగా చూస్తే జగన్ మీద పవన్ పైచేయి సాధించినట్లేగా?