ఈ కాంగ్రెస్ అభ్యర్ధి నిజంగా గ్రేట్

తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత తప్పటంలేదు. రాష్ట్రంలో మంచి సానుకూలతతో రెండోసారి బీజేపీ అధికారంలో కంటిన్యు అవుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడాలేకుండా రాష్ట్రం మొత్తం యోగి ఆదిత్యనాద్ పాలనపై జనాలు సానుకూలత చూపించారు. ఈ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీచేసినా బీజేపీ, ఎస్పీ తప్ప మరే పార్టీయేదీ మంచి ఫలితాలను రాబట్టలేకపోయింది.

నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన మాయావతి పార్టీ బీఎస్పీ కూడా పూర్తిగా దెబ్బతినేసింది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకోవటానికి ఏమీలేకపోయింది. పార్టీ తరపున పోటీచేసిన వందలాదిమంది అభ్యర్ధులకు ఠికాణాలేకుండా పోయింది. ఇలాంటి నేపధ్యంలోనే కూడా కాంగ్రెస్ తరపున ఒకే ఒక అభ్యర్ధి గెలిచారంటే సదరు అభ్యర్ధిని గ్రేట్ అని చెప్పక తప్పదు. పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక అభ్యర్ధి ఎవరయ్యా అంటే ఆరాధనా మిశ్ర. ఈమె మాత్రమే ఇక్కడ నుండి ఎందుకు గెలిచారంటే దీనికొక చరిత్రుంది.

అదేమిటంటే యూపీలో రాంపుర్ ఖాస్ అనే నియోజకవర్గముంది.  ఈ నియోజకవర్గంలో 1980 నుండి కాంగ్రెస్ అభ్యర్ధి తప్ప మరొకపార్టీ అభ్యర్ధి గెలిచిందే లేదట. బీజేపీ గాలికాదు ఎస్పీ, బీఎస్పీ గాలివీచిన ఎన్నికల్లో కూడా మిగిలిన నియోజకవర్గాల సంగతిని పక్కనపెట్టేస్తే రాంపుర్ ఖాస్ మాత్రం కాంగ్రెస్ అడ్డానే అని తేలిపోయింది. 1980లో మొదటిసారి ఈ నియోజకవర్గంలో ప్రమాద్ తివారి గెలిచారు. 1985, 89,91, 93,96,2002, 2007,2012 ఎన్నికల్లో తివారీయే గెలిచారు.

2013లో తివారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో 2014లో ఇక్కడ జరిగిన ఉఫెన్నికలో తివారి కూతురు ఆరాధనా మిశ్ర పోటీచేసి గెలిచారు. తర్వాత జరిగిన 2017 ఎన్నికల్లో కూడా ఆమె గెలిచారు. మళ్ళీ తాజా ఎన్నికల్లో కూడా ఆరాధాన మిశ్రాయే గెలిచారు. అంటే తొమ్మిది ఎన్నికల్లో తండ్రి, మూడు ఎన్నికల్లో కూతురు గెలవటమంటే వీళ్ళకున్న రికార్డు మామూలుగా లేదని అర్ధమైపోతోంది. మరి రాష్ట్రమంతా కాంగ్రెస్ ఓడిపోయినా ఒక్క రాంపుర్ ఖాస్ లో మాత్రం తివారీ కుటుంబమే ఎందుకు గెలుస్తోందో అర్ధం కావటంలేదు.