ఏపీలో ఎమ్మెల్యేల‌కు రూ.2 కోట్లు.. బ‌డ్జెట్‌లో వెల్ల‌డి

ఏపీ ప్ర‌భుత్వం ఎమ్మెల్యేల‌కు శుభ‌వార్త చెప్పింది. గ‌తంలో అసెంబ్లీ వేదిక‌గా.. సీఎం జ‌గ‌న్ ఇచ్చిన హామీని ఇప్పుడు నెర‌ర్చింది. ఎమ్మెల్యేల‌కు ఇక కాసుల వ‌ర్షం కురియ‌నుంది. తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ప్ర‌తి ఎమ్మెల్యేకి.. రూ.2 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.

పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఎమ్మెల్యేకు ఈ నిధులు అందించ‌నున్నామ‌ని.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. దీంతో ప్ర‌భుత్వంపై రూ.300 కోట్లు భారం ప‌డుతుంద‌ని మంత్రి వివరించారు. అయిన‌ప్ప‌టికీ.. దీనిని చేయాల‌ని ప్ర‌భుత్వంనిర్ణ‌యించింద‌న్నారు.

దేశంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌ని విధంగా త‌మ ప్ర‌భుత్వం చేస్తోంద‌ని తెలిపారు. 2019లో ఏర్ప‌డిన జ‌గ‌న్ స‌ర్కారు తొలి అసెంబ్లీ స‌మావేశంలోనే జ‌గ‌న్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.2 కోట్ల చొప్పున అభివృద్ధి నిదులు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. అయితే.. ఇప్ప‌టికి మూడేళ్లు గడిచిపోయినా.. ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. కేవ‌లం వైసీపీ ఎమ్మెల్యేల‌కే కాకుండా.. టీడీపీ ఎమ్మెల్యేల‌కు కూడా ఈ నిధులు ఇస్తామ‌ని.. రాష్ట్రంలో స‌రికొత్త అభివృద్ధి ప్ర‌క్రియ‌కు నాంది ప‌లుకుదామ‌ని.. అప్ప‌ట్లో జ‌గ‌న్ చెప్పారు.

కానీ, త‌ర్వాత‌.. కాలంలో క‌రోనా నేప‌థ్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి.. ఈ నిధులు కేటాయించే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యేలు.. కొన్నాళ్లుగా త‌మ‌కు నిధులు ఇవ్వాల‌ని.. ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ ప‌నులు చేయాల‌న్నా.. ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌క‌టించిన‌ బ‌డ్జెట్లో ఎమ్మెల్యేల‌కు నిధులు కేటాయిస్తూ.. ప్ర‌క‌ట‌న చేశారు.

ఒక్కొక్క ఎమ్మెల్యేకు.. రూ.2 కోట్ల చొప్పున ఏడాదికి నిధులు ఇస్తారు. వీటిని నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు ఖ‌ర్చుచేయాల్సి ఉంటుంది. అయితే.. వీటిని నేరుగా ఎమ్మెల్యేలకు ఇచ్చి వారి చేతుల మీదుగా ప‌నులు ప్రారంభించ‌నున్నారు. ప్ర‌తి ఎమ్మెల్యేకు.. రూ. 2 కోట్ల చొప్పున రూ.350 కోట్ల‌ను ప్ర‌భుత్వం నేరుగా ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు మాత్రం 300 కోట్ల‌ను మాత్ర‌మే మంత్రి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.