ప్రముఖులందరినీ ఒకేసారి ఊడ్చేసిన ఆప్

ఎన్నికల్లో పాల్గొన్న ప్రముఖులు ఒక్కోసారి ఓడిపోవటం సహజంగా జరుగుతున్నదే. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. కానీ పోటీచేసిన ప్రముఖులంతా ఒకే పద్దతిలో ఓడిపోవటం అన్నది మాత్రం దేశంలోని ఏ రాష్ట్రంలోను జరిగినట్లు లేదు. ఈ రికార్డు పంజాబ్ లో మొట్టమొదటిసారి నమోదైంది. విషయం ఏమిటంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ప్రముఖులంతా ఆప్ చేతిలోనే ఓడిపోవటం విచిత్రంగా ఉంది.

ఓడిన ప్రముఖులు మామూలు ప్రముఖులు కాదు. అత్యంత ఘనచరిత్ర కలిగిన ప్రముఖులు కావటమే ఆశ్చర్యం. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిరోమణి అకాలీదళ్ నేత 94 ఏళ్ళవయస్సున్న  ప్రకాష్ సింగ్ బాదల్ లంబీ నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఆప్ తరపున పోటీచేసిన జగ్ పాల్ సింగ్ బాదల్ చేతిలో ఓడిపోయారు. ఈయన కొడుకు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుండి పోటీచేశారు. ఈయన కూడా ఆప్ అభ్యర్ధిచేతిలోనే ఓడిపోయారు.

ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ ఈ ఎన్నికల్లో చామ్ కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుండి పోటీచేశారు. రెండుచోట్లా గెలుపుపై నమ్మకంతో పోటీచేస్తే  రెండుచోట్లా ఓడిపోయారు. రెండుచోట్ల కూడా ఆప్ అభ్యర్ధుల చేతిలోనే ఓడిపోయారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్ధాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో పోటీచేశారు. పాటియాలాలో కెప్టెన్ దశాబ్దాలుగా గెలుస్తునే ఉన్నారు. అలాంటిది తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధి అజిత్ పాల్ సింగ్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఆప్ అభ్యర్ధి జీవన్ జోత్ కౌర్ చేతిలో సుమారు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చివరగా సోనూసూద్ చెల్లెలు మాళవికా సూద్ మోగా నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడచిన 40 ఏళ్ళుగా ఓడిందేలేదు. అలాంటిది మొదటిసారి మాళవిక సూద్ ఆప్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. సోనూసూద్ కు పేరు కారణంగా, సోను చేసిన ప్రచారం కారణంగా మాళవిక కచ్చితంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆప్ దెబ్బకు ఓడిపోయింది. మొత్తంమీద ప్రముఖులందరినీ ఆప్ ఒకదెబ్బకు ఊడ్చిపారేసింది.