టాలీవుడ్‌కు షాక్‌.. ఇదేం లాజిక్ జగన్?

హమ్మ‌య్య‌.. స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల‌కు సంబంధించి కొత్త రేట్ల జీవో వ‌చ్చేసింది. హీరో హీరోయిన్లు, ద‌ర్శ‌కుడి పారితోష‌కం కాకుండా వంద కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమాల‌కు తొలి ప‌ది రోజులు టికెట్ల ధ‌ర‌లు పెంచుకునే అవ‌కాశం కూడా ఇచ్చేశారు. ఇంకేముంది ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న భారీ చిత్రం రాధేశ్యామ్‌కు ప్ర‌యోజ‌నం ద‌క్క‌బోతోంద‌ని ఆ సినిమాను న‌మ్ముకున్న వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

కానీ వారి ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లేసింది జ‌గ‌న్ స‌ర్కారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 20 శాతం షూటింగ్ జ‌రిగిన చిత్రాల‌కే ఈ ఆఫ‌ర్ అంటూ జీవోలో పెట్టిన మెలిక‌ను బ‌య‌టికి తీసి ఆ చిత్రానికి రేట్లు పెంచుకునే అవ‌కాశం లేకుండా చేశారు. మార్చి 25న రాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఇదే వ‌ర్తించ‌బోతోంది. సాధార‌ణ రేట్ల‌కే ఈ సినిమా టికెట్ల‌నూ అమ్మ‌క త‌ప్ప‌దు.

ఐతే ఎప్పుడో రెండు మూడేళ్ల ముందు షూటింగ్ మొద‌లుపెట్టుకుని గ‌త ఏడాదే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రాల‌కు నిన్న కాక మొన్న రిలీజైన జీవోను వ‌ర్తింప‌జేయ‌డం.. ఏపీలో 20 శాతం షూటింగ్ అనే మెలిక పెట్టి వాటికి గండి కొట్ట‌డం ఏం లాజిక్కో అర్థం కావ‌డం లేదు జ‌నాల‌కు. నిజానికి ఈ విష‌యం ఇంత‌కుముందే చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ రెండు చిత్రాలూ ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి కాబ‌ట్టి వీటికి ఆ నిబంధ‌న వ‌ర్తించ‌ద‌ని, రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని మంత్రి పేర్ని నాని స్ప‌ష్ట‌త ఇచ్చారు.

కానీ రాధేశ్యామ్ రిలీజ్ టైంకి క‌థ మారిపోయింది. రేట్ల పెంపుతో టికెట్లు అమ్ముదామ‌ని.. ఈ మేర‌కు స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని..  ఈ సినిమాకు బుధ‌వారం వ‌ర‌కు బుకింగ్సే ఓపెన్ చేయ‌లేదు ఎక్క‌డా. గురువారం కూడా మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎక్క‌డా బుకింగ్సే మొద‌లు కాలేదు. కానీ రేట్ల పెంపు లేద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో సాయంత్రం హ‌డావుడిగా సాధార‌ణ రేట్ల‌తో బుకింగ్స్ మొద‌ల‌య్యాయి. ఈ ఆల‌స్యం వ‌ల్ల వ‌సూళ్ల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.