ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా….

తాజాగా వెలువడుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన బీజేపీ గోవాలో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీనిస్తోంది. ఇక, పంజాబ్ లో ఆప్ అన్ని పార్టీలను ఊడ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా పయనిస్తోంది.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. కడపటి వార్తలు అందేసరికి ఆప్ 88 స్థానాల్లో దూసుకుపోతోంది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే. పంజాబ్ లో సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ ల మధ్య కోల్డ్ వార్ తో కాంగ్రెస్ 12 స్థానాలకు సరిపెట్టుకుంది. ఇక, కాంగ్రెస్ తో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న కెప్టెన్ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మన్ దాదాపు 55వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.  

ఇక, యూపీలో బీజేపీ 264 స్థానాలలో లీడింగ్ లో ఉండగా…ఎస్పీ 124 స్థానాలలో లీడింగ్ లో ఉంది. ఉత్తరాఖండ్ లో బీజేపీ 41, కాంగ్రెస్ 25 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. గోవాలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తప్పేలా లేవు. గోవాలో బీజేపీ 19, కాంగ్రెస్ 14, ఆప్ 2, ఇతరులు 7 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. మణిపూర్ లో బీజేపీ 23 స్థానాలలో లీడింగ్ లో ఉంటూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. మణిపూర్ లో కాంగ్రెస్ 13, ఎన్పీపీ 11 స్థానాలకు పరిమితమయ్యాయి.  

యూపీలో టీవీల్లో వస్తున్న కథనాలు, ట్రెండ్స్ చూసి సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఎస్పీ అధినేత అఖిలేష్ అన్నారు. వంద స్థానాల్లో ఓట్ల తేడా కేవలం 500 మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు, నేతలంతా కౌంటింగ్ బూత్ ల వద్దే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.