పవన్ సభకు అనుమతి.. కామెడీ ఏంటంటే?

జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపమా.. భయమా అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడం ద్వారా 2014లో తాను అధికారంలోకి రాకపోవడానికి పరోక్షంగా కారణమయ్యాడన్న కోపం పవన్ మీద జగన్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్‌ను ఎలా దెబ్బ తీయాలా అని పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలను దెబ్బ కొట్టడానికి జగన్ సర్కారు ఎంత ఏకపక్షంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. అలాగే జనసేనాని రాజకీయ కార్యక్రమాలకు కూడా ఏదో రకంగా అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. కరోనా పేరు చెప్పి పవన్ చేపట్టిన అనేక కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఐతే ఇప్పుడు కరోనా ప్రభావం బాగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా పవన్‌కు, జనసేనకు అడ్డంకులు తప్పట్లేదు.

మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను అమరావతిలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే.. జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో, ప్రైవేటు భూముల్లో ఈ కార్యక్రమం పెట్టుకుంటే.. దానికి అనుమతి నిరాకరించడం విడ్డూరం. ఈ విషయంలో తీవ్ర విమర్శలు రావడం, దీనిపై జనసేన నాయకులు కోర్టుకు వెళ్లడానికి సిద్ధపడటంతో ఇప్పుడు వెనక్కి తగ్గారు. అనుమతి ఇచ్చారు. కానీ ఈ సభను ఎలా జరపాలనే విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అందులో కొన్ని మరీ విడ్డూరంగా ఉన్నాయి.

పోలీసుల పేర్కొన్న షరతుల్లో ఒకటేంటంటే.. ఈ సభలో వేరే పార్టీలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విమర్శలు చేయకూడదట. ఒక రాజకీయ పార్టీ సభ ఏర్పాటు చేస్తే అందులో వేరే పార్టీని విమర్శించకూడదనడం ఎంత చిత్రం? మరి ప్రతిపక్ష పార్టీ.. అధికార పార్టీ మీద విమర్శ చేయకుండా ఉంటుందా? అలాంటపుడు ఇక సభ పెట్టడం ఎందుకు? జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. ప్రభుత్వం ఇలాంటి షరతు పెడితే ఊరుకునేవాడా? అసలు ప్రజాస్వామ్యంలో ఇలాంటి షరతు ఎవరైనా పెడతారా? ఇలాంటి ప్రశ్నలతో జగన్ సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు జనసైనికులు.