ఆ పార్టీ వెంట పడుతున్న పీకే!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే, ఎన్నిక‌లకు ముందు ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టి… ఫ‌లితం తేలి ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు ఆయ‌న అక్క‌డే పాగా వేస్తుంటారు. అలాంటి పీకేకు ఓ స‌మ‌స్య ఎదురైంది. ఆయ‌న గోవా మ‌హారాష్ట్ర‌వాదీ గోమంత‌క్ పార్టీ రూపంలో పీకే స‌వాల్ ఎదుర్కుంటున్నారు.

మిగ‌తా పార్టీలు పీకే చుట్టు తిరుగుతుంటే… పీకే మాత్రం ఈ పార్టీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఆస‌క్తిక‌రంగా సాగిన గోవా ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌వాదీ గోమంతక్ పార్టీ కింగ్ మేక‌ర్‌గా నిలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించాయి. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాద‌ని, 13 నుంచి 17 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని పేర్కొన్నాయి. దీంతో ఈ పార్టీకి గిరాకీ పెరిగింది.

గోవాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21సీట్లు అవ‌స‌రం. దీంతో ఇన్ని రోజుల పాటు భాగ‌స్వామప‌క్షంగా ఉన్న ఈ పార్టీ.. ఇప్పుడు ఒక్క‌సారిగా కింగ్‌మేక‌ర్ స్థాయికి ఎదిగిపోయింది. రాష్ట్ర రాజ‌కీయాల‌ను బొంగ‌రంలా తిప్పే స్థాయికి చేరుకుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ గోమంతక్ పార్టీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాయి. గోవా మ‌హారాష్ట్ర‌వాదీ గోమంత‌క్ పార్టీ కింగ్ మేక‌ర్ అవ‌డంతో జాతీయ పార్టీలు మంత‌నాల‌కు తెర లేపాయి.

మ‌రోవైపు తృణ‌మూల్‌తో పొత్తుకు గోమంత‌క్ పార్టీ మొగ్గు చూపుతోంది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు సుదిన్ ధ‌వ‌ళీక‌ర్ పేర్కొన్నారు. అయితే పాత కాపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా? అన్న విష‌యంపై ఆయ‌న మౌనం వ‌హించారు. టీఎంసీ అగ్ర‌నేత అభిషేక్ బెన‌ర్జీ, వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ త‌న‌తో భేటీ అయ్యార‌ని ఆయ‌న వివ‌రించారు. “చాలా విష‌యాలు వారితో ప్ర‌స్తావించా. అయితే పొత్తుపై మాత్రం ఇప్పుడే చెప్ప‌లేను` అని సుదిన్ ధ‌వ‌ళీక‌ర్ అన్నారు. దీంతో ప్ర‌శాంత్ కిశోర్‌కే ప‌రేషాన్ చేస్తున్న పార్టీగా గోవా మ‌హారాష్ట్ర‌వాదీ గోమంత‌క్ పార్టీ నిలిచింద‌ని టాక్ వినిపిస్తోంది.