పేద‌ల‌కు ఇప్పుడు క‌ష్టం కాదా జ‌గ‌న్‌?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

మొత్తానికి ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్న జీవో రానే వ‌చ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఏడాది అనూహ్యంగా త‌గ్గించి ప‌డేసిన టికెట్ల రేట్ల‌ను పెంచుతూ, అలాగే ఐదో షోకు అనుమ‌తి ఇస్తూ జ‌గ‌న్ స‌ర్కారు జీవో జారీ చేసింది. స‌రిగ్గా భీమ్లా నాయ‌క్ సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుని, దాదాపుగా దాని థియేట్రిక‌ల్ ర‌న్ ముగుస్తున్న త‌రుణంలో ఈ జీవోపై సీఎం జ‌గ‌న్ సంత‌కం చేయ‌డం విశేషం. దీన్ని బ‌ట్టి భీమ్లా నాయ‌క్‌కు ప్ర‌యోజ‌నం చేకూడ‌న్న ఉద్దేశంతోనే ఈ జీవోను ఇన్ని రోజులు ఆపార‌ని, అది త‌ప్ప వేరే కార‌ణం లేద‌న్న‌ది స్ప‌ష్టం.

త‌న‌ను క‌లిసి టికెట్ల రేట్లు పెంచాల‌ని కోరిన‌ బృందంలో ప్ర‌భాస్ కూడా ఉండ‌టంతో ఈ శుక్ర‌వారం రిలీజ‌య్యే అత‌డి సినిమా రాధేశ్యామ్‌కు లాభం చేకూర్చేలా.. దాని టికెట్ల బుకింగ్స్ మొద‌ల‌వుతున్న త‌రుణంలోనే ఈ జీవో ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
ఐతే టికెట్ల రేట్ల‌ను స‌వ‌రిస్తూ.. ఇండ‌స్ట్రీ కోరుకున్న స్థాయిలోనే రేట్ల‌ను పెంచారు. అవి అంద‌రికీ రీజ‌న‌బుల్‌గానే అనిపిస్తున్నాయి.

కానీ ఇన్నాళ్లూ సీఎం జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులంద‌రూ పాడిన పాట గురించి ప్ర‌స్తావించాలి. నిత్యావ‌స‌రాలు స‌హా అన్ని ధ‌ర‌లూ ఇంత‌గా పెరిగిన స‌మ‌యంలో.. సినిమా టికెట్ల రేట్ల‌ను ఇంత త‌గ్గించేయ‌డం ఏంటి, థియేట‌ర్ల మెయింటైనెన్స్ కూడా క‌ష్ట‌మ‌వుతోంద‌ని సినీ జ‌నాలు గ‌గ్గోలు పెడితే.. పేద‌ల కోస‌మే ఈ రేట్ల త‌గ్గింప‌ని, పేదోళ్లు సినిమాలు చూడ‌కూడ‌దా అని ద‌బాయిస్తూ మాట్లాడారు వైసీపీ నేత‌లు.

స్వ‌యంగా సీఎం జ‌గ‌నే ఓ స‌భ‌లో పేద‌ల కోసం రేట్లు త‌గ్గిస్తే దాన్ని కూడా త‌ప్పుబ‌డుతున్నారంటూ వాదించారు. ఇన్నాళ్లూ ఈ వాద‌న చేసి ఇప్పుడు మాత్రం రేట్లు పెంచేస్తే పేద‌లు సినిమాలు చూడటం ఎలా మ‌రి? అంటే కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇబ్బంది పెట్ట‌డానికి, సినీ పెద్ద‌లంద‌రూ వ‌చ్చి త‌మ‌ను వేడుకునేలా చేయ‌డానికి మాత్ర‌మే రేట్లు త‌గ్గించార‌న్న‌మాట‌. ప‌వ‌న్ సినిమాల‌ను దెబ్బ తీసి, ఇండ‌స్ట్రీ జ‌నాల్ని చెప్పుచేతుల్లో పెట్టుకున్నాక టికెట్లు రేట్లు పెంచ‌డానికి ఓకే అన్న‌మాట‌.పేద‌ల కోసం టికెట్ల రేట్లు త‌గ్గించామ‌న‌డం బూట‌క‌మ‌న్న‌మాట‌.