భీమ్లా కథ ముగిసింది లే జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకోలేదు. పెట్రోల్ సహా అన్నింటి మీదా విపరీతంగా పన్నుల భారం మోపి జనాల నడ్డి విరిచారు. కానీ ఒక్క సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి పేదలు గుర్తుకొచ్చేసి ధరలు తగ్గించేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఈ ధరల తగ్గింపు జరిగిందన్నది స్పష్టం. ఆ తర్వాత సమస్య సినిమాలను నమ్ముకున్న అందరి మెడకూ చుట్టుకుంది. అన్ని ధరలూ విపరీతంగా పెరిగిపోయిన స్థితిలో ప్రభుత్వం చెప్పిన రేట్లతో థియేటర్లను నడిపించడం అసాధ్యంగా మారుతోందని ఎంత మొత్తుకున్నా కూడా ఏపీ సర్కారు వినిపించుకున్న పాపాన పోలేదు.

ఏమన్నా అంటే పేదవాడికి సినిమా చూసే అవకాశం లేదా.. వాళ్లను దోచుకుంటారా అన్నారు. ఎప్పుడో ఒకసారి చూసే సినిమా విషయంలో ఇంత ఆందోళన వ్యక్తం చేసి నిత్యావసరాల ధరల పెంపును మాత్రం పట్టించుకోలేదు. చివరికి చిరంజీవి సహా ఇండస్ట్రీ ప్రతినిధులు విన్నపాలు చేసుకుంటే, ఏపీ సీఎంను పొగడ్తల్లో ముంచెత్తితే తప్ప ఆయన మనసు కరగలేదు.

ఐతే రేట్లు పెంచుకునే, అదనపు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తామని ఏపీ సీఎం స్వయంగా ప్రకటించి నాలుగు వారాలు గడుస్తోంది. కానీ సంబంధిత జీవో మాత్రం రాలేదు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం వల్లే జీవో ఆలస్యమైందన్నారు కానీ.. నిజానికి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలవుతోందని తెలిసే ఉద్దేశపూర్వకంగా ఆపారన్నది బహిరంగ రహస్యం. ఆ సినిమా థియేట్రకిల్ రన్ ముగిశాక కానీ జీవో బయటికి రాదని అందరికీ తెలుసు. రెండో వీకెండ్లో ఓ మోస్తరు వసూళ్లు సాధించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ పరంగా ముగింపు దశకు వచ్చినట్లే.

వీకెండ్ అయ్యాక వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చు. ఈ వారాంతంలో ‘రాధేశ్యామ్’ వచ్చేసరికి దీని పనైపోవచ్చు. ఎలాగూ ప్రభాస్ చిరుతో కలిసి ముఖ్యమంత్రిని కలిశాడు. ఆయన దగ్గర వినమ్రంగా ఉన్నాడు. జగన్‌పై పొగడ్తలూ గుప్పించాడు. ‘బాహుబలి’తో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వచ్చి తన దగ్గర తగ్గి ఉన్నాడంటే పవన్ ఈ మధ్య ఓ సభలో అన్నట్లుగా జగన్ ఇగో శాటిస్ఫై అయ్యే ఉండొచ్చు. ఎలాగూ ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ రన్ కూడా ముగిసిపోతోంది కాబట్టి ఇంకో రెండు మూడు రోజుల్లోనే టికెట్ల రేట్లు, షోల పెంపుకు సంబంధించి జీవో వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు.