చివరి క్షణంలో టీడీపీ మనసు మార్చుకుందా ?

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో చివరి నిముషంలో తెలుగుదేశంపార్టీ మనసు మార్చుకున్నట్లుంది. ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీకి హాజరయ్యేది లేదని గత సమావేశాల్లో చంద్రబాబునాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే. చంద్రబాబు శపథం చేశారు సరే మరి మిగిలిన సభ్యుల సంగతి ఏమిటి ? అనే విషయంలో పార్టీలోనే ఇన్ని రోజులు బాగా అయోమయం ఉండేది.

అయితే ఇపుడు ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఎందుకంటే సొమవారం నుండి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఆధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎప్పటిలాగానే ఇక్కడ కూడా మిశ్రమస్పందన వచ్చింది. అయితే చివరకు బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు లేకుండా మిగిలిన సభ్యులు హాజరు కావాలని డిసైడ్ చేశారు. దీనికి కారణం ఏమిటంటే రాజధాని అమరావతి నిర్మాణంపై కోర్టు ఇచ్చిన తీర్పే.

మూడు రాజధానుల ఏర్పాటులో ప్రభుత్వానికి అధికారం లేదని, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కానీ అసెంబ్లీకి కానీ లేదని చెప్పింది. దీంతో ప్రభుత్వం తీవ్రంగా విభేదిస్తోంది. అందుకనే కోర్టుల పరిధి, అధికారాలపై సభలో చర్చిస్తామని మంత్రులు, ఎంఎల్ఏలు చెబుతున్నారు.

దీంతోనే సభలో అమరావతి కేంద్రంగా కీలకమైన చర్చ జరిగే అవకాశముంది. సరిగ్గా ఈ పాయింట్ విషయంలోనే ఎల్ఏలు, ఎంఎల్సీలు సభకు హాజరు కావాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ ముఖ్యనేతల సమావేశంలోను, పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా సభకు హాజరవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనే మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

అలాంటిది  హఠాత్తుగా సభకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారంటే అది కోర్టు తీర్పు నేపథ్యంలో అని అర్ధమైపోతోంది. అమరావతిపై కోర్టు అంశం సభలో ప్రస్తావనకు వచ్చినపుడు, కోర్టు పరిధి, అధికారాలపై చర్చ సమయంలో టీడీపీ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు అన్నదే ఇక్కడ ఆసక్తిగా మారింది. మంత్రులు, ఎంఎల్ఏల వైఖరి చూస్తుంటే కోర్టు తీర్పును పూర్తిగా తప్పు పట్టేట్లు ఉన్నారు. మరి ఈ చర్చలో టీడీపీ సభ్యుల పాత్ర ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి కారణం ఏదైనా సభకు హాజరుకావాలని టీడీపీ నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామమనే చెప్పాలి. చూద్దాం సభలో ఏమవుతుందో.