‘జగన్ ను మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారు’

అడిగిన దానికి అడిగినంత వరకు సమాధానం చెప్పటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటు. అందుకు భిన్నంగా అడిగిన దానికి అవసరం లేకున్నా సమాధానం చెబుతూ.. ఆ క్రమంలో మరింత సమాచారాన్ని అందించి రాజకీయ కాకకు కారణమవుతుంటారు మరికొందరు నేతలు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి కోవలోకి వస్తారు. ఆమెను ఎంతలా ఇరుకున పెట్టాలని చూసినా.. పప్పులు ఉడకవు. ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతే ఇచ్చే ఆమె.. అనవసర వ్యాఖ్యలకు.. వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఆమె నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య ఒకటి షాకింగ్ గా కంటే కూడా సర్ ప్రైజింగ్ గా మారిందని చెప్పాలి.

తాజాగా అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మించే నాసిన్ క్యాంపస్ కు భూమి పూజ చేసేందుకు ఆమె ఏపీకి వచ్చారు. ఇక్కడ నాసిమ్ అంటే కాస్త క్లారిటీ ఇవ్వాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్.. ఇండైరెక్టు టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్థ. ఇది చేసే పనేమిటంటే.. డెహ్రాడూన్ లో ఐఏఎస్ లకు.. ఐపీఎస్ లకు హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ ఎలానో.. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) లకు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పని చేస్తుంది.

దీంతో.. ‘పాలసముద్రం’ మరింత ఫేమస్ కావాల్సి ఉంది. ఈ కేంద్రాన్ని అక్కడెక్కడో ఉన్న అనంత జిల్లాలో నిర్మించటానికి కారణం.. విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి అందించే పరిహారాల్లో ఈ భవనం ఒకటి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు .ఏపీకి ఎలాంటి సమస్యలు వచ్చినా కేంద్రం తండ్రి స్థానంలో ఉంటూ ఆదుకుంటుందని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని మోడీ తండ్రిలా అప్యాయంగా చూసుకుంటారని పేర్కొన్నారు.

అందుకే.. సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా సరే.. ఆయన్ను కాదనకుండా కలుస్తారని చెప్పారు. ఏపీ డెవలప్ మెంట్ కు ఎలాంటి సాయం చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏమైనా.. ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ కు ఉన్న సంబంధం నిర్మలమ్మ నోటి నుంచి వచ్చిన తీరు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. మరి.. బీజేపీకి మిత్రుడి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ ను ప్రధాని మోడీ మరెలా చూసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.