కపిల్ రికార్డు బద్దలు కొట్టిన జడేజా

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ఈ టెస్టును శాసించే బలమైన స్థితికి చేరుకుంది. దీంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక జట్టు 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి కష్టాల్లో పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక టాపార్డర్ కుప్పకూలింది.

రెండో రోజు ఆటలో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జడేజా భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ రికార్డును బద్దలుగొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 150 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుపుటలకెక్కాడు. జడేజా కంటే ముందు కపిల్‌దేవ్, రిషభ్ పంత్ ఈ ఘనత సాధించినవారిలో ఉన్నారు. దీంతోపాటు సర్ జడేజా మరో రెండు రికార్డులు కూడా సాధించాడు.

ఏడో నంబర్ బ్యాట్స్ మన్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి ఒక ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీల భాగస్వామ్యాలు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా జడ్డూ నిలిచాడు. రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కు 104 పరుగులు, అశ్విన్‌తో కలిసి 7వ వికెట్‌కు 130 పరుగులు, 9వ వికెట్‌కు షమీతో కలిసి 103 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. 7వ నంబర్ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగుకు దిగి అజేయంగా 175 పరుగులు సాధించిన తొలి ఇండియన్‌గానూ జడేజా మరో రికార్డు సృష్టించాడు.

అంతకుముందు, ఓవర్‌నైట్ స్కోరు 357/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 574/8 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. పంత్ 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అశ్విన్ 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 29 పరుగుల వద్ద ఔట్ కాగా, విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. హనుమ విహారి 58 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.