బాబు త‌ప్ప‌.. అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు

సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల హాజరుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తుది నిర్ణయం తీసుకుంది.  గ‌త న‌వంబ‌రులో జ‌రిగిన స‌మావేశాల్లో చంద్ర‌బాబు స‌తీమ‌ణిని వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు ఘోరంగా అవ‌మానించారంటూ.. బాబు క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే చట్టసభలకు వెళ్లరాదని, సీఎం అయ్యాకే వ‌స్తాన‌ని శ‌ప‌థం చేశారు. దీంతో స‌భ‌కు వెళ్లాలా? వ‌ద్దా అనే విష‌యంపై పార్టీ రెండురోజులుగా నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు.

చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం ఆన్లైన్లో జరిగిన టీడీఎల్పీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై.. చంద్రబాబు టీడీఎల్పీలో చర్చించారు.

అయితే.. ఎఎవ‌రు ఎలా అనుకున్నా.. ప్ర‌జ‌ల కోసం.. టీడీపీ ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఈ క్ర‌మంలో తాను చేసిన శ‌ప‌థానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. కానీ, పార్టీనేత‌లు మాత్రం ప్ర‌జ‌ల కోసం.. స‌భ‌ల‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో సోమ‌వారం నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌కు చంద్ర‌బాబు త‌ప్ప‌.. మిగిలిన నాయ‌కులు హాజ‌రు కానున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై నిల‌దీయాల‌ని కూడా చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు. ఇటు అసెంబ్లీ, అటు మండ‌లిలోనూ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా స‌భ‌ల‌కు హాజ‌రై.. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని.. ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ముఖ్యంగా చెత్త‌ప‌న్ను, ఓటీఎస్‌, లే అవుట్ల‌లో 5 శాతం భూముల కేటాయింపు, రాజ‌ధానిపై హైకోర్టు తీర్పు వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌లు మ‌న‌ల్ని ఎన్నుకున్న విష‌యాన్ని మ‌నం మ‌రిచిపోరాద‌ని.. అన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సోమ‌వారం నుంచి స‌భ‌కు హాజ‌రు కానున్నారు.