మూడు నెలల్లో ఏం చేస్తారో? జ‌గ‌న్‌కు స‌వాలే

పాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీ హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. అంతే కాకుండా భూ స‌మీక‌ర‌ణ స‌మ‌యంలో రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని క‌చ్చితంగా పాటించాల‌ని ఆదేశించింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుందో అనే ఆస‌క్తి క‌లుగుతోంది. హైకోర్టు విధించిన గ‌డువు లోపు రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నులు చేస్తుందా? లేదా ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తుందా? అన్న‌ది సందేహంగా మారింది.

రైతుల‌తో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారికిచ్చిన హామీల అమ‌లుపై హైకోర్టు గ‌డువులు నిర్దేశించింది. రాజ‌ధానిలో నెల రోజుల్లో మౌలిక వ‌స‌తులు, మూడు నెలల్లో ఎల్‌పీఎస్ లేఅవుట్‌లు అభివృద్ధి చేసి రైతుల‌కు స్థలాలు అప్ప‌గించాల‌ని ఆదేశించింది. అంతే కాకుండా రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధి ఆరు నెలల్లో పూర్తి చేయాల‌ని పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌నుల పురోగ‌తిపై కోర్టుకు నివేదిక‌లు అంద‌జేయాల‌ని ఆదేశించింది. దీంతో హైకోర్టు నిర్దేశించిన గ‌డువు లోపు వైసీపీ ప్ర‌భుత్వం ఈ ప‌నులు చేస్తుందా? అనే ప్ర‌శ్న రేకెత్తుతోంది.

కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాలంటే వెంటనే సీఆర్‌డీఏను రంగంలోకి దించాలి. కానీ అప్ప‌ట్లో చేసిన ప‌నుల‌కు ఇంకా కొంద‌రు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌లేదు. ఆ బిల్లులు ఇవ్వ‌కుండా వాళ్లు మ‌ళ్లీ ప‌ని చేసేందుకు ముందుకు వ‌స్తారా? అన్న‌ది అనుమాన‌మే. ఎల్‌పీఎస్ లే అవుట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం 4.45 శాతం ప‌నులే జ‌రిగాయి. ఇప్పుడా ప్రాంత‌మంతా పిచ్చి మొక్క‌ల‌తో నిండిపోయింది. వాటిని తొల‌గించి, హ‌ద్దులు నిర్ణ‌యించేందుకు నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు అప్పుల్లో కూరుకుపోతున్న ఏపీకి ఈ అభివృద్ధి ప‌నుల కోసం నిధులు స‌మ‌స్య వేధించ‌డం ప‌క్కా. నిధుల స‌మీక‌ర‌ణ త‌ల‌నొప్పిగా మారుతుంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై స్పందిస్తూ ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు పంచుతున్నారు క‌దా అని హైకోర్టు ప్ర‌స్తావించింది. అలాగే ఈ రాజ‌ధాని నిర్మాణం కోసం కూడా నిధులు ఖ‌ర్చు చేయాల‌ని సూచించింది.

రైతుల‌కు ప్లాట్ల‌ను అభివృద్ధి చేసి ఇవ్వ‌డ‌మ‌నేది స‌మ‌యం, నిధులతో ముడిప‌డిన అంశ‌మ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అలాంటిది మూడు నెలల్లో ఏ ర‌కంగా ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రాక్టిక‌ల్‌గానే మాట్లాడుతున్నా త‌ప్ప ఎవ‌రినో కించ‌ప‌ర‌చ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.