పుతిన్ కు మోదీ ఫోన్… గుడ్ న్యూస్

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే, రష్యా సేనల దాడిలో కర్ణాటక విద్యార్థి నవీన్ మరణించగా…ఇతర కారణాలతో మరో విద్యార్థి మృతి చెందాడు. ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వీలైనంత ఎక్కువమందిని వీలైనంత తక్కువ సమయంలో స్వదేశానికి చేరవేసేందుకు మోడీ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు.

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంలో పరిస్థితిని ఇద్దరు నాయకులు సమీక్షించారని, అక్కడ చిక్కున్న భారతీయుల విషయంలో తాము సహకారం అందిస్తున్నామని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వెల్లడించారు. యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి భారతీయ పౌరులను రష్యన్ భూభాగానికి తరలించే ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అందుకోసం, ‘‘హ్యుమానిటేరియన్ కారిడార్’’ను రూపొందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ  కారిడార్ ద్వారా ఖార్కివ్ నుంచి భారతీయుల బృందాన్ని అత్యవసరంగా తరలించాలని చూస్తున్నామన్నారు. అయితే, అలా తరలిస్తున్న విద్యార్థులను ఉక్రేనియన్ భద్రతా దళాలు బందీలుగా పట్టుకున్నాయని రష్యా మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, భారత విద్యార్థులను ఉక్రెయిన్ ఆర్మీ బందీలుగా మార్చుకుందన్న వార్తలను ఇండియన్ ఎంబసీ తోసిపుచ్చింది.

మరోవైపు, ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల‌ను తీవ్ర‌త‌రం చేసింది. ప్ర‌భుత్వ ఆస్తులు, కార్యాల‌యాల‌తోపాటు జ‌నావాసాల‌పై కూడా దాడులు జరుపుతోంది. ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌లు, భ‌వ‌నాలతోపాటు కీవ్లోని మెట్రో స్టేషన్ స‌మీపంలో నేడు భారీ పేలుళ్లు సంభ‌వించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ వద్ద పేలుళ్లు సంభ‌వించాయి. కీవ్ న‌గ‌రంపై ర‌ష్యా సేనలు బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఖేర్సన్ నగరాన్ని రష్యా నేడు త‌మ అధీనంలోకి తెచ్చుకుంది.