యూపీ ఫలితాలను టర్న్ చేయనున్న బీజేపీ!

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. ఏడు విడతల పోలింగ్ లో ఇప్పటికి ఐదు విడతలు అయిపోయాయి. గురువారం ఆరో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో జరిగిపోయిన పోలింగ్ సరళిపై అనేక విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. వీటి ప్రకారం బీజేపీ-ఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపోటములపై బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఎందుకంటే దళితుల్లో కీలకమైన జాతవ్ ల ఓట్లు ఎక్కువగా బీఎస్పీకే పడ్డాయని సమాచారం. మిగిలిన వాళ్ళ ఓట్లలో మెజార్టీ బీజేపీకి పడిందంటున్నారు. ఇదే సమయంలో జాట్లు, ముస్లింలు, యాదవుల ఓట్లు మ్యాగ్జిమమ్ ఎస్పీకే పడినట్లు చెబుతున్నారు. అలాగే ఓబీసీ ఓట్లలో బీజేపీ-ఎస్పీ కూటమి చీల్చుకున్నాయట. ఈ ఓట్ల చీలిక దగ్గరే బీఎస్పీ అభ్యర్థుల పాత్ర కీలకమైంది. ప్రతి నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్ధులు గనుక 10 వేల ఓట్లకు పైగా తెచ్చుకుంటే కచ్చితంగా అది పై రెండు కూటముల్లోని ఎవరో ఒకరిపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.

ఎందుకంటే బీఎస్పీ తరపున 93 మంది దళితులు పోటీ చేస్తున్నారు. 114 మంది ఓబీసీలను బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దింపారు. 86 మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. 110 మంది అగ్రవర్ణాల వారు బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. ముస్లింలకు ఎస్పీ కూడా ఇన్ని టికెట్లివ్వలేదు. బీఎస్పీ తరపున పోటీచేస్తున్న వారిలో ఎస్పీ తరపున పోటీ చేసే అవకాశం దొరక్క చివరి నిముషంలో బీఎస్పీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలోకి దిగిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని తక్కువ అంచనా వేసేందుకు లేదని విశ్లేషకులంటున్నారు.

ప్రస్తుత ఎన్నికలు ఎలా జరుగుతున్నాయంటే గెలుపు నీదా నాదా అన్నంత టైటుగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో మధ్యలో బీఎస్పీ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటే పై రెండు ప్రధాన కూటముల అభ్యర్ధులపై అంత ప్రభావం పడుతుంది. నిజానికి బీఎస్పీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అయితే ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులపై దెబ్బ పడటానికి మాత్రం కారణమవుతుంది.  అందుకనే అందరు ఇపుడు బీఎస్పీ అభ్యర్థుల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.