ఉత్త‌ర‌ప్ర‌దేశ్ దేశానికి దిక్సూచి.. మోడీ ర‌హ‌స్యం

కేంద్రంలో ఎవ‌రు పాగా వేయాల‌న్నా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అత్యంత కీల‌కం. ఇది ఎవ‌రైనా ఒప్పుకునేదే. అయితే..ప్ర‌ధాని మోడీ ఈ విష‌యాన్ని గ‌తంలో ఒప్పుకునేవారు కాదు. దీనికి కార‌ణం ఏంటో తెలియ‌దు కానీ, అన్ని రాష్ట్రాలూ స‌మాన‌మ‌నే వారు. అయితే.. తాజాగా ఆయ‌న మ‌న‌సులో మాట చెప్పేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(యూపీ) త‌మ‌కు అత్యంత కీల‌కమ‌ని చెప్పారు. దేశానికి ఈ రాష్ట్ర‌మే దిక్సూచి అని వెల్ల‌డించారు. అంతేకాదు.. అంతర్జాతీయంగా ఎదురవుతోన్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ మరింత శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్పై ఆ బాధ్యత ఎక్కువగా ఉందని సూచించారు. యూపీలోని మహరాజ్గంజ్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచంలోని ప్రతిఒక్కరిని ప్రభావితం చేసే అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని భారత్ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ప్రధానమంత్రి. అతిపెద్ద రాష్ట్రంగా.. భారత్ను బలంగా తయారు చేయటంలో యూపీదే కీలక బాధ్యతని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వైబ్రెంట్ విలేజ్ పేరుతో సరికొత్త పథకాన్ని కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు.

“ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా సవాళ్లు పీడిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం నుంచి సైన్యం, సముద్రం నుంచి అంతరిక్షం వరకు ప్రతి రంగంలో భారత్ ప్రబలశక్తిగా ఎదగాలి.“ అని మోడీ చెప్పారు.

నేపాల్ సరిహద్దులోని మహరాజ్గంజ్కు.. ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే పర్యటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. సరిహద్దుల్లోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు చెప్పారు. తాము వాగ్దానాలు మాత్రమే చేయమని, వాటికి నిధులు కేటాయించి పూర్తిచేస్తామన్నారు. కుటుంబ పాలకులు కరోనా వ్యాక్సిన్లపై ఆరోపణలు చేస్తూ.. దేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  వారు ప్రతిసారీ తమ కుటుంబ బాగోగుల గురించే ఆలోచించారని, కానీ,బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తోందన్నారు.