అధికారంలోకి రాగానే.. తొలి సంత‌కం దానిపైనే: రేవంత్

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..  ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చడంపైనే తొలి సంతకం పెడ్తామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనా మాకు చేయాలని టీఆర్ఎస్‌ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, దమ్ముంటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసి రారు. కేసీఆర్‌ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వస్తారని కాంగ్రెస్‌ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం లేక పీసీసీ అ‍ధ్యక్షుడిగా తాను ఎంపికకాగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్‌… తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చి.. 12 నెలల్లోపే 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర సీనియర్‌ నేతలు హాజరై దీక్షను విరమింపచేశారు. అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి టీఆర్ ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాల నేతల నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికితే… కేసీఆరే స్వరాష్ట్ర పోరాటం చేసినట్లు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. నీళ్లు-నిధులు-నియామకాలే ప్రధాన అజెండాగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే… ఒక్క కేసీఆర్‌ ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. ఏడేళ్లకాలంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించి ఉంటే… బిశ్వాల్‌ కమిటీ ప్రకారం లక్షా 90 వేల ఖాళీలు ఎందుకున్నాయని ప్రశ్నించారు.