వరుణ్ తేజ్ వెర్సస్ రవితేజ

పవన్ కళ్యాణ్ చిత్రం ‘భీమ్లా నాయక్’ కచ్చితంగా వాయిదా పడొచ్చన్న సంకేతాలతో వరుణ్ తేజ్ మూవీ ‘గని’ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తెచ్చేద్దామని అనుకున్నారు దాని మేకర్స్. ఈ మేరకు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. కానీ ఆ ఉత్సాహం కొన్ని గంటలకే పరిమితం అయింది. ‘గని’కి డేట్ ఇచ్చిన రోజే ‘భీమ్లా నాయక్’ను ముందు అన్న ప్రకారమే ఫిబ్రవరి 25కే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆ తర్వాత ఆ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ జరగలేదు.

అనుకున్నట్లే శుక్రవారం ఆ సినిమా రిలీజైపోయింది. దీంతో ‘గని’ని మరోసారి వాయిదా వేసి కొత్త డేట్ కోసం ఎదురు చూస్తోంది చిత్ర బృందం. ఇంకోసారి డేట్ ఇచ్చి.. తర్వాత మారిస్తే బాగోదని అన్నీ చూసుకున్నాకే విడుదల తేదీని ప్రకటిద్దామని చూస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ల దృష్టిలో ఉన్న డేట్ అయితే ఏప్రిల్ 1 అని సమాచారం. అసలు అది తప్ప వేసవిలో వేరే డేట్ దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ఏప్రిల్ 1కి ముందు ‘సర్కారు వారి పాట’ను అనుకున్నారు. తర్వాత ‘భీమ్లా నాయక్’ ఆ తేదీకి రావచ్చన్నారు.

ఆపై ‘ఆచార్య’నూ ఆ తేదీకే ఫిక్స్ చేశారు. కానీ ఈ మూడు చిత్రాల్లో ఏదీ ఆ తేదీని వాడుకోలేదు. మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీ వస్తుండటంతో ఏప్రిల్ 1న వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి కొంచెం భయపడుతున్నారు. ఐతే ‘గని’ టీం ఇప్పుడు ఆ తేదీని వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీం కళ్లు కూడా ఇప్పుడు ఆ డేట్ మీదే పడ్డాయట. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. మార్చి 1న టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ల హడావుడి మొదలైందంటే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నట్లే. రెండూ మీడియం రేంజ్ చిత్రాలే కాబట్టి ఏప్రిల్ 1నే గని, రామారావు ఆన్ డ్యూటీ ఏప్రిల్ 1నే వస్తే ఆశ్చర్యమేమీ లేదు. కనీసం ఇందులో ఒక్కటైనా ఆ తేదీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.