ప్రభుత్వాలు సినిమాలను పడగొట్టలేవు.. నిలబెట్టలేవు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు ఎలా ఉంటుందన్నది మరోసారి అందరూ చూస్తున్నారిప్పుడు. ఏపీ సీఎం జగన్ బద్ద శత్రువుల్లోఒకరిగా భావించే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైతే.. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఆ సినిమా మీదే ఫోకస్ పెట్టిందిప్పుడు. ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచకూడదంటూ.. అదనపు షోలు వేయకూడదంటూ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి అధికారిక ఆదేశాలు రావడం విశేషం. స్వయంగా కలెక్టర్లు వీడియోల ఆదేశాలు ఇచ్చారు ఈ విషయమై.

ఎక్కడికక్కడ జాయింట్ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, వీఆర్వోలు రెండు రోజులుగా తమకు ఇంకే విధులు లేనట్లు దీని మీదే దృష్టిసారించారు. నిన్న రిలీజ్ రోజు ప్రతి థియేటర్ దగ్గరా వీఆర్వోలు, పోలీసులు మోహరించారు. ప్రతి సినిమాకూ ఇలా చేస్తున్నారా అంటే అదేమీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకే ఇదంతా. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి ఆమోదం తెలిపి, జీవోను కూడా రెడీ చేశాక సాంకేతిక కారణాలు చెప్పి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం.. ఆల్రెడీ ఆమోదం తెలిపిన విషయాన్ని పక్కన పెట్టేసి ఇలా ఒక సినిమాను టార్గెట్ చేయడం కక్ష సాధింపు కాక మరేంటి?

ఐతే ప్రభుత్వాలు సినిమాలను పడగొట్టలేవు.. నిలబెట్టలేవు అన్న విషయమే జగన్ సర్కారుకు అర్థమవుతున్నట్లు లేదు. ఇందుకు ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలే ఉదాహరణ. టికెట్ల రేట్లు తగ్గించినా, అదనపు షోలు ఆపేసినా.. అఖండ ఏపీలో కూడా విజయవంతం అయింది. జగన్‌కు రాజకీయ శత్రువైనప్పటికీ బాలయ్య తన సినిమాతో ఏపీలో సత్తా చాటాడు. అక్కడ తన చిత్రాన్ని హిట్ చేసుకోగలిగాడు. ‘పుష్ప’ను సైతం జగన్ సర్కారు టార్గెట్ చేసినప్పటికీ ఏపీలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. కాకపోతే దాని మీద బయ్యర్ల పెట్టుబడి మరీ ఎక్కువగా ఉండటం వల్ల నష్టాలు వచ్చాయి.

ఐతే జగన్ సర్కారుకు మద్దతుదారు, ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసిన మోహన్ బాబు ఇటీవల సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా రిలీజవుతున్నపుడే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశమిచ్చారు. కొన్ని రోజుల ముందే నైట్ కర్ఫ్యూ కూడా తీసేసి సెకండ్ షోకు ఛాన్సిచ్చారు. కానీ ఏం లాభం ఒక్కో థియేటరుకు పది మంది కూడా ప్రేక్షకులు రాక దారుణమైన పరాభవాన్ని చవిచూసింది సన్ ఆఫ్ ఇండియా.

ప్రభుత్వం ఈ సినిమాకు పరోక్షంగా సపోర్ట్ చేసినా ఏం ప్రయోజనం? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగిందా? ఆ సినిమా ఫలితాన్ని మార్చగలిగిందా? ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ను ఏపీ సర్కారు ఎలా టార్గెట్ చేస్తోందో తెలిసిందే. టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల కొంత మేర బయ్యర్లకు నష్టం వచ్చినా.. ఈ సినిమా చూడ్డానికి ఎగబడుతున్న ప్రేక్షకులను అడ్డుకోగలరా? దీన్ని బట్టే అధికారం ఉన్నంతమాత్రాన ఒక సినిమాను పడగొట్టడం.. లేదా నిలబెట్టడం తమ చేతుల్లో ఉండదని జగన్ సర్కారు అర్థం చేసుకుంటే మంచిదేమో.