మోడీ మెడ‌కు 6000 కోట్ల గుజ‌రాత్ స్కాం?

మంచి అయినా… చెడు అయినా కావ‌చ్చు గుజరాత్ లోని ప‌రిణామాలు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి క‌నెక్ట్ అయిపోతాయ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్థానికంగా జ‌రిగే అభివృద్ధి ప‌నులు, రాజ‌కీయాలు, అవ‌క‌త‌వ‌క‌లు బీజేపీ ర‌థ‌సార‌థిని టార్గెట్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ కుంభ‌కోణం విష‌యంలో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీపై ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. గుజరాత్‌లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ కుంభ‌కోణం జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి గా ఉన్న ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సైతం ఈ మ‌కిలి అంటింద‌ని ఆరోపించారు.

కోల్‌ ఇండియా 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల్లో 60 లక్షల టన్నుల బొగ్గును  గుజరాత్‌లోని వ్యాపారులు, చిన్నపరిశ్రమ దారుల పేరిట పంపించింది. ఆ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ర్టాల్లో రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అధిక ధరకు అమ్మేసుకున్నార‌ని త‌ద్వారా గుజ‌రాత్ రాష్ట్రంలోని చిన్న, మద్యతరహా పరిశ్రమలకు ఉద్దేశించిన బొగ్గు లావేదేవీలతో బీజేపీ పెద్ద‌ల‌కు లింక్‌లు ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్ర‌భుత్వం ద్వారా స‌ర‌ఫ‌ర అయిన బొగ్గు ఇతర రాష్ర్టాల్లోని పెద్ద కంపెనీలకు అమ్మేసుకున్న ఈ భారీ కుంభ‌కోణంపై నిర్ణీత గడువుతో దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. బొగ్గు కుంభకోణం చోటుచేసుకున్న 14 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు (ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, విజయ్‌ రూపాణీ, భూపేంద్ర పటేల్‌) పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను తమవద్దే అట్టిపెట్టుకోవడం కాకతాళీయం కాకపోవచ్చని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని కాంగ్రెస్‌ ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ మీడియాకు చెప్పారు.

కోల్‌ ఇండియా గనుల నుంచి వెలికి తీసిన బొగ్గు ఉద్దేశించిన పరిశ్రమలకు చేరలేదని అన్నారు. బొగ్గు  లబ్ధిదారుల గురించి గుజరాత్‌ ప్రభుత్వం పంపిన వివరాలు నకిలీవని తేలిందని, ఉద్దేశించిన గమ్యానికి బొగ్గు చేరనే లేదని అన్నారు. బొగ్గు నుంచి లబ్ధి పొందేందుకు బహుశా నకిలీ బిల్లులు సృష్టించి ఉంటారని అన్నారు. ఈ విష‌యంలో బీజేపీ పెద్ద‌లు స్పందించాల‌ని డిమాండ్ చేశారు.