అమ‌రావ‌తి: ఉద్య‌మం ఆగ‌దు ఫ‌లితం తేల‌దు?

అమ‌రావ‌తి ఉద్య‌మానికి 800 రోజులు పూర్త‌య్యాయి నేటితో..ఈ నేప‌థ్యంలో ఉద్య‌మం ఉద్ధృతి మాత్రం త‌గ్గ‌బోద‌ని సంబంధిత నిర‌స‌న‌కారులు, భూములు ఇచ్చి స‌ర్వం కోల్పోయిన రైతులు ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆ రోజు తాము భూములు ఇచ్చింది రాష్ట్రా ప్ర‌భుత్వానికే త‌ప్ప చంద్ర‌బాబు కో లేదా తెలుగుదేశం పార్టీ కో కాద‌ని అంటూ వీళ్లంతా గ‌గ్గోలు పెడుతున్నారు.

త‌మ స‌మ‌స్య‌ను కులం కోణంలో కాకుండా సామాజిక ఇతివృత్త ప‌రంగా చూడాల‌ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జ‌గ‌న్ తో తాము స‌మ‌స్యల విష‌య‌మై చ‌ర్చించేందుకు సిద్ధంగానే ఉన్నామ‌ని అంటున్నారు. ముఖ్యంగా త‌మ‌ను కానీ త‌మ  ఉద్య‌మాన్ని కానీ కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌డం మాత్రం త‌గ‌ద‌ని, బొత్స లాంటి నేత‌లు, వారు చేస్తున్న అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు చెబుతున్నారు.

అండ‌గా ఉంటాం : చంద్ర‌బాబు
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 800 రోజులు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద వ్యక్తిగత కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం.రాజ‌ధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే, ఇప్పుడు అమరావతి భూముల‌ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధానిని పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం అండగా నిలుస్తుంది..అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. 


ఏక ప‌క్ష నిర్ణ‌యాలు త‌గ‌దు
మ‌రోవైపు ఈ ఉద్య‌మంకు సంబంధించి ఏ ప‌ట్టింపూ లేకుండా జ‌గ‌న్ ఉంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాము మూడు రాజ‌ధానుల నిర్మాణానికే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. కానీ వీళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారంపై మాత్రం అస్స‌లు దృష్టి ఉంచ‌డం లేదు. తాము కూడా ఆంధ్రుల‌మేన‌ని, భూములు ఇచ్చిన రైతుల‌తో క‌నీసం మాట్లాడ‌కుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం త‌గ‌ద‌ని అంటున్నారు. ఆ రోజు భూ స‌మీకర‌ణ అంటూ కొంత సేక‌ర‌ణ పేరిట కొంత తమ నుంచి భూములు ప్ర‌భుత్వం తీసుకుంది అని, త‌రువాత వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌మ‌కు చెల్లించాల్సిన ప‌రిహారంలో కానీ లేదా తాము అప్ప‌గించిన భూమి అభివృద్ధి చేసి భూమి కి భూమి పరిహారంగా ఇవ్వాల్సిన విష‌యంలో కానీ ఏ విధంగా చూసుకున్నా ఇంత‌వ‌ర‌కూ న్యాయం చేయ‌లేద‌ని వీరంతా వాపోతున్నారు. భూములు ఇచ్చిన పాపానికి ఇప్ప‌టికీ తాము శోకం అనుభ‌విస్తున్నామ‌ని అంటున్నారు.