అట్టుడుకుతున్న ఏపీ : నిన్న అంగ‌న్ వాడీలు నేడు ఆశాలు

ఆంధ్రావ‌నిలో అటు అంగ‌న్ వాడీలు ఇటు ఆశావ‌ర్క‌ర్లు వ‌రుస నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. సోమ‌వారం నాడు అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లంతా క‌నీస వేత‌నాలు 26 వేలుగా నిర్ణ‌యించాల‌ని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వాల‌ని, అదేవిధంగా కోవిడ్ టైంలో ప్రాణాలు విడిచిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతూ రోడ్డెక్కారు. దీంతో జిల్లా క‌లెక్ట‌రేట్లు అన్నీ నిర‌స‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోయాయి.చాలా చోట్ల పోలీసు నిర్బంధాల‌ను దాటి మ‌రీ! అంగ‌న్ వాడీలు రోడ్డెక్కారు. కానీ ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

అదేంటంటే అంగ‌న్ వాడీల‌ను గ్రేడ్ 2 సూప‌ర్ వైజ‌ర్లుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వు వ‌చ్చింది. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డిచింది. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యాన్ని కొంద‌రు వ్య‌తిరేకించ‌గా ఇంకొంద‌రు స‌మ‌ర్థించారు. ఇదే స‌మ‌యాన జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేయాల‌ని కోరుతూ ఓ వాట్సాప్ మెసేజ్ రావ‌డంతో సంబంధిత వ‌ర్గాలు విస్తుబోయాయి.

దీంతో సంఘ నేత‌లు ఇలాంటివేవీ వ‌ద్ద‌ని మ‌రో వాట్సాప్ మెసేజ్ ఇవ్వ‌డంతో ఓ గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జీతాల పెంపుపై ప్ర‌భుత్వ వైఖ‌రి ఏంట‌న్న‌ది తెలియకుండా చాలీ చాల‌ని వేత‌నాల‌తో క‌నీసం సంక్షేమ ప‌థ‌కాల‌కు సైతం నోచుకోకుండా తాము ఎంత కాలం అని వెట్టి చాకిరీ చేయాల‌ని వీరంతా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు ఆశావ‌ర్క‌ర్లు కూడా త‌మ గొంతుక వినిపిస్తున్నారు. గౌర‌వ వేత‌నాన్ని 15 వేల‌కు పెంచాల‌ని, కోవిడ్ స‌మ‌యంలో ప్రాణాలు కోల్పోయిన (విధులు నిర్వ‌ర్తిస్తూ) ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ నిన్న‌టి వేళ క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ధ‌ర్నాలకు ఉప‌క్ర‌మించి, తమ వేద‌న వెల్ల‌డించారు.ఇదే స‌మ‌యంలో ఆశా వ‌ర్క‌ర్ల‌ను నిలువరించి ధ‌ర్నాల‌కు రాకుండా వారిని నియంత్రించి రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల మందిని అరెస్టు చేశారని సంబంధిత యూనియ‌న్లు గ‌గ్గోలు పెడుతున్నాయి.

విశాఖ‌,గుంటూరు, విజ‌య‌న‌గ‌రం తో స‌హా ప‌లు ప్రాంతాల్లో పోలీసులు అతి కార‌ణంగా ఆశా వ‌ర్క‌ర్లు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డార‌ని, త‌మ‌తో ప్ర‌వ‌ర్తించే తీరు ఇదేనా అంటూ వీరంతా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నా రు.ముఖ్యంగా ఎక్క‌డిక‌క్క‌డ గృహ నిర్బంధాల‌ను అమ‌లు చేయ‌డంతో పోలీసులు వీలున్నంత వ‌ర‌కూ ధ‌ర్నాల‌ను నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.అయినా స‌రే చాలా మంది త‌మ యూనిఫాం అయిన తెల్ల చీర‌ల్లో కాకుండా వేరే రంగు చీర‌లు క‌ట్టుకుని, వేర్వేరు మార్గాల్లో క‌లెక్ట‌రేట్ల‌కు చేరుకుని ధ‌ర్నాల్లో పాల్గొని త‌మ ఆకాంక్ష‌లు వెల్ల‌డించారు.