వివాదంలో సీనియర్ నరేష్

Naresh

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన తీరు ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఇప్పుడు నరేష్ ప్రమేయం లేకుండా తన పేరు వివాదంలో చిక్కుకుంది. ఆయన మాజీ భార్య రమ్య రఘుపతిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి ఆమె ఈ మహిళల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లోనే కాక అనంతపురం, హిందూపురంల్లో రమ్య భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. రమ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె. ఆమెకు, నరేష్‌కు ఎనిమిదేళ్ల కిందట హిందూపురంలో పెళ్లి జరిగింది. ఐతే కొన్నేళ్లు కలిసి ఉన్న ఈ జంట తర్వాత విడిపోయింది. ఇద్దరూ అధికారికంగా విడిపోయారా లేదా అన్నది తెలియదు. ఐతే నరేష్‌కు ఉన్న భారీ ఆస్తులను చూపించి, అవి తన సొంతమని చెబుతూ రమ్య చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆమె మోసం గ్రహించి తనపై చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, రమ్య నుంచి తాను దూరంగా ఉంటున్నానని నరేష్ అంటున్నారు. నరేష్‌కు రమ్యతో జరిగింది రెండో పెళ్లి. మొదటి భార్య ద్వారా ఆయనకు నవీన్ అనే కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆయన కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో కలిసి ఉంటున్నారు.

ఆమెకు ఆల్రెడీ పెళ్లయింది. పిల్లలున్నారు. భర్త నుంచి పవిత్ర అధికారికంగా విడాకులేమీ తీసుకోలేదు. ఐతే ‘సమ్మోహనం’ సినిమాలో భార్యాభర్తలుగా నటించిన సమయంలో నరేష్‌కు, పవిత్రకు సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ కలిసి ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాలతో పాటు ఎక్కడికి వెళ్లినా పవిత్రను వెంట తీసుకెళ్తున్నారు నరేష్. ఇలాంటి టైంలో మాజీ భార్య రమ్య కారణంగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు.