అమెరికా నుండి గంజాయి దిగుమతా ?

వినడానికి కాస్త విచిత్రంగానే ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు, విదేశాలకు మన దగ్గర నుంచి గంజాయి ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. కానీ రివర్సులో విదేశాల నుంచి అందునా అమెరికా నుంచి గంజాయి దిగుమతి అవ్వటం మాత్రం ఇదే మొదటిసారి. దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు గంజాయి దిగుమతయ్యింది. అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయి పరుపుల మధ్య వచ్చింది. లక్డీకాపూల్ లోని ఒక పరుపులు అమ్మే ఏజెన్సీకి గంజాయి చేరింది.

అమెరికా నుంచి కొందరు పరుపులు దిగుమతి చేసుకోవటం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పద్దతిలోనే ఆ ఏజెన్సీకి రెండు పరుపులు వచ్చాయి. పరుపులు చేరుకోగానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు దాడి చేసి పరుపులను స్వాధీనం చేసుకున్నారు. ఒకటిగా ఉన్న రెండు పరుపులను విడదీస్తే మధ్యలో 1.42 కిలోల గంజాయి బయటపడింది. కొరియర్ కంపెనీలోని అడ్రస్ ప్రకారం పరుపులను అక్షయ్ జైన్, అమరేందర్ తెప్పించుకున్నారు.

ఏజెన్సీలోని ఇన్వాయిస్ ప్రకారం ఎన్సీబీ అధికారులు వెంటనే పై ఇద్దరినీ అరెస్టు చేశారు. వాళ్ళిద్దరు కూడా తామే అమెరికా నుండి గంజాయిని తెప్పించుకున్నట్లు అంగీకరించారు. అమెరికా నుండి రెగ్యులర్ గా నిషేధిత మత్తు పదార్ధాలను తెప్పించుకుంటున్నట్లు చెప్పారు. పరుపుల మధ్యలో గంజాయి హైదరాబాద్ కు రావటం బాగానే ఉంది. అయితే అసలు అమెరికాలో గంజాయిని పరుపుల మధ్య ఉంచి ఎలా ఎగుమతికి అనుమతించారన్నదే అర్ధం కావటం లేదు.

ఒక వస్తువును ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అమెరికాలో చాలా ఆంక్షలుంటాయి. అన్ని ఆంక్షలను దాటుకుని అమెరికా నుంచి గంజాయి హైదరాబాద్ కు చేరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయి చాలా హై క్వాలిటీదని అధికారులు చెప్పారు. మన దగ్గర దొరికే గంజాయికన్నా అమెరికా నుండి దిగుమతైన గంజాయి క్వాలిటిలో 10 రెట్లు ఎక్కువట. అలాగే మన దగ్గర పండే గంజాయి వాసన ఎక్కువగా ఉంటుందట. ఇపుడు దిగుమతైన గంజాయి వాసన పెద్దగా ఉండదని అధికారులు చెప్పారు.