పెరిగిపోతున్న ఆనం-నేదురుమల్లి పోరు

వెంకటగిరిలో అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పోరు పెరిగిపోతోంది. రోజు రోజుకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. జిల్లాల పునర్విభజన అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి ప్రధాన కారణమవుతోంది. ముందు నుండే ఆనం రామనారాయణరెడ్డికి ప్రభుత్వంపైన మండిపోతోంది.  ప్రభుత్వం అనేకన్నా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెక్టుగా ఉంటుంది. తనంతటి సీనియర్ ను పక్కన పెట్టేసి, జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటంపైన ఆనం అలిగారు.

అయితే ఆనం అలకను జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. అసలు ఆనంను పార్టీలోకి చేర్చుకుని వెంకటగిరిలో టికెట్ ఇవ్వటమే ఎక్కువని పార్టీల్లోని నేతలే చాలామంది బాహాటంగా వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటిది ఇక జగన్ ఎందుకు పట్టించుకుంటారు ? దీంతో ఆనం అలక కాస్త అసంతృప్తిగా మారి చివరకు ఆగ్రహంగా స్థిరపడింది. చాలా కాలంగా ఏదో విషయం మీద ఆనం మీడియా సమావేశంలో దుమ్మెత్తిపోస్తు ఉన్నారు. అయితే మంత్రులు కానీ ఎంఎల్ఏలు కానీ సీనియర్ నేతలు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఈ నేపధ్యంలోనే జిల్లాల పునర్విభజన జరిగింది. తమకు బాగా పట్టున్న వెంకటగిరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపటాన్ని ఆనం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తంచేశారు. పనిలోపనిగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిపైన కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. దాంతో జనార్ధనరెడ్డి కొడుకు కమ్యూనిటి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమ్యూనిటి ఛైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సీన్ లోకి ఎంటరయ్యారు. ఆనంపై రెగ్యులర్ గా విరుచుకుపడుతున్నారు.

నిజానికి మొన్నటి ఎన్నికల్లో వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డే పోటీ చేయాల్సింది. కానీ చివరి నిముషంలో చేరిన ఆనం కోసం జగన్ నేదురుమల్లిని ఒప్పించారు. దాంతో ఆనం పోటీ చేసి గెలిచారు. ఇపుడు అవకాశం వచ్చింది కదాన్న ఉద్దేశ్యంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కోసం నేదురుమల్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆనంకు టికెట్ దక్కే అవకాశం లేదని పార్టీలోనే ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే రామ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయిపోయారు. అందుకనే ఆనంకు ఎక్కడికక్కడ కౌంటర్లిస్తున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య మాటల యుద్ధమైతే జోరుగా సాగుతోందన్నది వాస్తవం.