నాగబాబు వచ్చాడండోయ్

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఆయన నిలకడ లేమి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేనతో ఆయన ప్రయాణం ఎప్పుడెలా సాగుతుందో చెప్పడం కష్టం. జనసేన మొదలు కావడానికి ముందు, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నేతగా ఉండగా.. మెగా అభిమానులంతా చిరంజీవితోనే ఉంటారని, పవన్ వైపు వెళ్లరు అన్నట్లుగా మాట్లాడాడు నాగబాబు.

కానీ జనసేన మొదలైన కొంత కాలానికి తమ్ముడికి సపోర్ట్ ఇచ్చాడు. జనసేనలో ఒక దశలో క్రియాశీలకంగా మారాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో స్వయంగా నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాడు. ఎన్నికల్లో పరాజయం తర్వాత కొన్నాళ్ల వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఆన్ లైన్ వరకే సాగింది. ఆఫ్ లైన్ అన్ని కార్యక్రమాలకూ దూరం అయిపోయాడు. కొన్ని నెలల నుంచి నాగబాబు తీరు చూస్తుంటే ఆయన రాజకీయాలకు టాటా చెప్పేశాడా అన్న సందేహాలు కలిగాయి.

కానీ ఇప్పుడు నాగబాబు ఉన్నట్లుండి నరసాపురంలో జనసేన చేపట్టిన మత్స్యకారుల అభ్యున్నతి సభకు విచ్చేశాడు. ఆ సభలో మరీ అంత చురుగ్గా ఏమీ వ్యవహరించలేదు కానీ.. అసలీ సభలో నాగబాబు కనిపించడమే చర్చనీయాంశంగా మారింది. నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఓడినా.. జనాల్లో ఉండి తర్వాతి ఎన్నికల్లోపు అయినా వారి మనసులు గెలవడం అవసరం. అప్పుడే మన వాడని, మన కోసం నిలుస్తాడని జనాల్లో భరోసా కలుగుతుంది.

అలా కాకుండా ఎన్నికల సమయానికి చుట్టపు చూపులా వచ్చి ఓట్లు వేయమంటే జనాలు ఎలా స్పందిస్తారో చెప్పేదేముంది? ఈ విషయం అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో జరిగిన కీలక సభకు నాగబాబు విచ్చేశాడు. పవన్ నిబద్ధత కలిగిన నేత అని, ఆయనో సమస్యను తలకెత్తుకుంటే కచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్న భరోసాతో మత్స్యకారులంతా ఆయన్ని నమ్ముతున్నారని.. కచ్చితంగా ఆయన జీవో నంబర్ 217కు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని నాగబాబు ఈ సభలో వ్యాఖ్యానించారు.