మార్చి 14న పవన్ ఏమి తేలుస్తాడో ?

నరసాపురంలో జరిగిన మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరగా చేసిన ప్రకటనపైనే అందరు చర్చించుకుంటున్నారు. బహిరంగ సభ ముగిసే ముందు మార్చి 14వ తేదీన జరగబోయే పార్టీ ఆవిర్భావ సభలో కలుద్దామని చెప్పారు. ఆ రోజున రాష్ట్ర భవిష్యత్ ఎలాగుండాలి ? ఎలా ఉండబోతోంది ? 2024 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయంపై చర్చిద్దామని పవన్ చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎవరితో పొత్తులుంటాయనే విషయంపై పవన్ క్లారిటీ ఇస్తారని జనాలు అనుకుంటున్నారు.

నిజానికి బీజేపీకి జనసేన మిత్రపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండు పార్టీల మధ్య ఉండాల్సిన సఖ్యత ఏ రోజూ లేవు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు, నిరసనలు దాదాపు లేవనే చెప్పాలి. నరసాపురంలో ఇపుడు జరిగిన బహిరంగ సభ కూడా జనసేన సొంతంగా చేసుకున్నదే కానీ బీజేపీని కలుపుకోలేదు. అందుకనే మిత్రపక్షాలు ఎప్పుడైనా విడిపోవచ్చని జరుగుతున్న  ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు బహిరంగంగానే పంపిన లవ్ ప్రపోజల్ కూడా అందరికీ తెలిసిందే. నిజానికి బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు చంద్రబాబు లవ్ ప్రపోజల్ పంపకూడదు.  రాబోయే ఎన్నికల్లో గెలవటం చంద్రబాబుకు అత్యంత కీలకం. రేపటి ఎన్నికల్లో కనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. క్యాడర్ చాలా డీలా పడుతుంది

అందుకనే  చంద్రబాబు పొత్తులకు సందేహించడం లేదు. ప్రస్తుతం బీజేపీతో పవన్ ఉన్నా లేనట్లే అన్నట్టుంది. ఈ నేపథ్యంలో పవన్ తో పొత్తుకు బాబు ఓపెన్ ఆహ్వానం ఇచ్చేశారు. రాజకీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో మార్చి 14వ తేదీన అన్నీ విషయాలను మాట్లాడుకుందామని పవన్ అనటంలో ఉద్దేశ్యం పొత్తుల విషయంపై క్లారిటి ఇవ్వటమే అనే చర్చ మొదలైంది. మరి మార్చి 14వ తేదీన పవన్ ఏమి చెబుతారో వినాల్సిందే.