చిరును గుర్తు చేస్తూ ప‌వ‌న్ నిప్పులు

సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకోవ‌డం ఆయ‌న అభిమానుల్ని చాలా బాధ పెట్టిన మాట వాస్త‌వం. టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో లేని స‌మ‌స్య‌ను సృష్టించి దాన్ని పెంచి పెద్ద‌ది చేసి.. ఇప్పుడు ప‌రిష్కారం కోసం చిరు స‌హా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్ని త‌మ వ‌ద్ద‌కు ర‌ప్పించుకుని, వారు త‌మ‌ను వేడుకునేలా జ‌గ‌న్ స‌ర్కారు చేసింద‌నే అభిప్రాయం అంద‌రిలో క‌లిగింది.

ముఖ్యంగా చిరుకు అపాయింట్మెంట్ ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టి, ఆయ‌న త‌న స్థాయిని ఎంతో త‌గ్గించుకుని జ‌గ‌న్‌ను వేడుకోవాల్సిన ప‌రిస్థితి క‌ల్పించ‌డం ప‌ట్ల మెగా అభిమానుల్లో తీవ్ర ఆగ్ర‌హం ఉంది. ఈ ప‌రిణామాలు చిరు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా బాగానే కోపం తెప్పించిన‌ట్లున్నాయి.
న‌ర‌సాపురంలో ఆదివారం నిర్వ‌హించిన మ‌త్స్య‌కార అభ్యున్న‌తి స‌భ‌లో ప‌వ‌న్.. జ‌గ‌న్ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలోనే నిప్పులు చెరిగాడు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల ఏపీ సీఎం వ‌ద్ద‌ చిరు చేతులు జోడించి వేడుకోవ‌డాన్ని గుర్తు చేస్తూ ప‌వ‌న్ త‌న ఆగ్ర‌హాన్ని చూపించాడు. వైసీపీ నాయ‌కుల ఆలోచ‌న విధానం గురించి వివ‌రిస్తూ.. ‘‘ఇంకెవ‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులుండ‌టం వారికి ఇష్ట‌ముండ‌దు. ఎంత‌సేపూ మ‌నంద‌రం వాళ్ల ద‌గ్గ‌రికొచ్చి దేహీ అంటూ ఉండాలి. ఎంత పెద్ద స్థాయి వ్య‌క్త‌యినా స‌రే.. జ‌గ‌న్ గారూ మీరు మాకు చెయ్యండిసార్ అంటూ దండం పెట్టి అడ‌గాలి.

అలా అంటే వాళ్ల ఇగో శాటిస్ఫై అవుతుంది. బావుంది.. తృఫ్తిగా ఉంది. త‌గ్గారు వీళ్లు నా ద‌గ్గ‌ర అనుకుంటారు’’ అంటూ.. హావ‌భావాల‌తో ప‌వ‌న్ అభిన‌యించి చూపించాడు. ఇది చూసిన అంద‌రికీ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు దండం పెట్టి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల కోసం చిరు వేడుకున్న దృశ్య‌మే గుర్తుకొచ్చింది. ఆ దృశ్యం చూసి ప‌వ‌న్ బాగా హ‌ర్ట‌య్యాడ‌ని ఆయ‌న మాట్లాడిన తీరుతో స్ప‌ష్ట‌మైంది.