ఓఎంసీ లీజుల కుట్రలో శ్రీలక్ష్మి ఇరుక్కున్నట్లేనా ?

అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లిమిటెడ్ కు మైనింగ్ లీజులు కట్టబెట్టిన ఘటనలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పూర్తిగా తగులుకున్నట్లేనా ? తాజాగా తెలంగాణా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. పై కంపెనీకి లీజులు కట్బెట్టే విషయంలో పెద్దఎత్తున అవినీతి జరిగింనేందుకు ఆధారాలున్నాయని కోర్టు తెల్చిచెప్పింది. జరిగిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రమేయంపై సరిపడా ఆధారాలున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.

జరిగిన అవినీతిలో తన పాత్ర లేదని, లీజుల కేటాయింపులో తాను నిబంధనలను అనుసరించినట్లు నిరూపించుకోవాల్సిన బాధ్యత కార్యదర్శి మీదే ఉందని కూడా కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఓఎంసీ కన్నా ముందే మరికొన్ని కంపెనీలు లీజుల కోసం దరఖాస్తులు చేసుకున్నా వాటిని పక్కన పెట్టేసినట్లు, ఈ క్రమంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ కేసుల విషయంలోనే శ్రీలక్ష్మి చాలా సంవత్సరాలుగా విచారణను ఎదుర్కొంటున్నారు. కొంతకాలం ఆమె జైల్లో కూడా ఉండి ప్రస్తుతం బెయిల్ మీద బయటున్నారు.

లీజుల కేటాయింపుల తన ప్రమేయం లేదని, కేవలం తాను నిబంధనలను మాత్రమే అనుసరించానని శ్రీలక్ష్మి వేసిన కేసులను కోర్టు కొట్టేసింది. ఆమె వాదనలో పసలేదని కోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. మైనింగ్ లీజులన్నీ కేంద్రం పరిధిలోనివి కాబట్టి ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను కోర్టు కొట్టేసింది. ఒఎంసీకి లీజులు ఇవ్వాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపానలని ప్రాధమిక ఆధారాలనుబట్టి అర్ధమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.

శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నపుడే ఆమె మరిది రాజేష్ బాబు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టు చెప్పింది. ఈ విషయం మీద కూడా విచారణను ఎదుర్కోవాల్సిందే అని కోర్టు తేల్చింది. లీజుల వ్యవహారంలో సీబీఐ పరిధిపై శ్రీలక్ష్మి లేవనెత్తిన అనేక అభ్యంతరాలను కూడా కోర్టు కొట్టేసింది. సీబీఐ పరిధిని నిర్ధారించే అవకాశం శ్రీలక్ష్మికి లేదని కోర్టు అభిప్రాయపడింది. అవినీతి జరిగిందని వచ్చే ఆరోపణలపై ప్రాధమిక ఆధారాలున్న ప్రతి కేసును సీబీఐ విచారించవచ్చని కోర్టు చెప్పింది. సో కోర్టు వ్యాఖ్యల తాజా పరిస్ధితుల్లో శ్రీలక్ష్మి విషయంలో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.