కేసీఆర్ ముంబై టూర్లో ప్ర‌కాశ్ రాజ్ ఎందుకున్నారు?

జాతీయ రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేర‌కు త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న శివ‌సేన ర‌థ‌సార‌థి, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న బృందంతో ఆదివారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా హాజ‌ర‌వ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ఈ సందర్భంగా భవిష్యత్‌ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై చర్చిస్తున్నారు. ఈ స‌మావేవం ముగిసిన అనంత‌రం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కేసీఆర్ క‌ల‌వ‌నున్నారు. మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి ముంబైకి బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ ఆయ‌న వెంట లేరు. ముంబై విమాన‌శ్ర‌యంలో ప్ర‌కాశ్ రాజ్ కేసీఆర్ క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌వెంట వ‌చ్చిన వారిని కేసీఆర్ ఆయ‌న‌కు పరిచ‌యం చేశారు.

గ‌తంలో మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ‌ను క‌లిసేందుకు క‌ర్ణాట‌క వెళ్లే స‌మ‌యంలో కూడా ప్ర‌కాశ్ రాజ్‌ను కేసీఆర్ వెంట‌తీసుకువెళ్లారు. అయితే, ప్ర‌కాశ్ రాజ్‌కు క‌ర్ణాట‌కలో ప‌రిచ‌యాలు ఉండ‌టం వ‌ల్ల వెంట‌బెట్టుకు వెళ్లార‌ని భావించారు. మ‌రి ముంబై టూర్‌కు తీసుకువెళ్ల‌డం ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌కాశ్‌రాజ్‌కు ఉన్న సినీ గ్లామ‌ర్‌ను ఉప‌యోగించుకునేందుకు ఠాక్రే మీటింగ్‌కు ఆహ్వానించార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రకాశ్ రాజ్ లేకుండా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలు చేయ‌లేరా అంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు.