కాపుల‌ను దువ్వుతున్న బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కాపు సామాజిక‌వ‌ర్గానికి కీల‌క పాత్ర అన‌డంలో సందేహం లేదు. అధికారంలోకి వ‌చ్చే పార్టీని నిర్ణ‌యించే సామ‌ర్థ్యం ఆ సామాజిక వ‌ర్గానికి ఉంది. అందుకే పార్టీల‌న్నీ వాళ్ల ఓట్ల కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన బీజేపీ.. ఇప్పుడా రాష్ట్రంలో కాపుల‌ను దువ్వే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌భావం చూపేందుకు అతి పెద్ద‌దైన కాపు సామాజిక వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకునేందుకు ఆ వ‌ర్గం స‌మ‌స్య‌ల‌పై బీజేపీ గ‌ళం విప్పుతోంది.

ఇప్పుడు ఏపీలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇవి రెండు క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం మొద‌టి నుంచి త‌న మీద కాపు సామాజిక‌వ‌ర్గం ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న నోటి నుంచి కాపు మాట వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఏం మాట్లాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కాపు స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి బీజేపీ ముందుకు వ‌చ్చింది.  

కాపుల‌కు విద్య, ఉద్యోగ రంగాల్లో అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. గ‌త ప్ర‌భుత్వం కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించింద‌ని.. మార్చి 15లోగా ఆ రిజ్వ‌రేష‌న్లు అమ‌లు చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేంద్రం ప్ర‌క‌టించిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని అమ‌లు చేయ‌డం లేదు. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను తీసుకుని బీజేపీ త‌న గ‌ళాన్ని వినిపిస్తోంది. ఇక కాపు రిజర్వేష‌న్ల కోసం ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసుకునే దిశ‌గా ఆ పార్టీ సాగుతోంది.

రాజ్య‌స‌భ‌లోనూ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌స్తావించారు. ఏపీలో 28 శాతం కాపు సామాజిక‌వ‌ర్గం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఓటు బ్యాంకును మ‌ళ్లించుకోవ‌డం కోసం బీజేపీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టింది. మ‌రోవైపు రాజ్యాధికారం సాధించ‌డం కోసం కాపు సామాజిక వ‌ర్గంలోని కీల‌క నేత‌లంతా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.