మోడీకి తలనొప్పిగా మారిన వరుణ్ గాంధీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ వరుణ్ గాంధీ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రైతుల పక్షాన నిలిచిన ఎంపీ ఆ మధ్య మోడీకి రాసిన లేఖలు, మోడీకి పంపిన వీడియోలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. యూపీలోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కొడుకు వాహనం నడిపి నలుగురు రైతులను చంపేసిన ఘటనపైన మోడీని ఎంపి బాగానే ఇరుకున పెట్టారు. రైతులకు మద్దతుగా మోడీకి ఎంపీ పెట్టిన ట్వీట్లు, వీడియోలనే ప్రతిపక్షాలు కూడా బాగా వాడుకున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హీట్ పెరిగిపోతున్న సమయంలో ఎంపీ  ఇపుడు మరో లేఖ రాశారు. ఆర్ధిక నేరగాళ్ళను ప్రభుత్వం ఎందుకు రక్షిస్తోందంటు తన లేఖలో మోడీని ఎంపి నిలదీయటం సంచలనంగా మారింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొడుతున్న రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు.

నీరవ్ మోడీ రు. 14 వేల కోట్లు, విజయ్ మాల్యా రు. 9 వేల కోట్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా గుజరాత్ లో బయటపడిన ఏబీజీ షిప్ యార్డు రు. 23 వేల కోట్ల కుంభకోణాన్ని కూడా ఎంపీ తన లేఖలో ఉదాహరణగా చూపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు దోచుకుంటుంటే తమ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని వరుణ్ గాంధీ తన లేఖలో మోడీని నిలదీశారు.

ఆర్ధిక నేరగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోగా వివిధ కారణాలతో వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మండిపడ్డారు. రోజుకు అప్పులతో ఎంతో మంది రైతులు, చేనేత కార్మికులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కేంద్రానికి తెలీదా అంటు ప్రశ్నించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం కేవలం కొందరు ఆర్ధిక నేరగాళ్ళకు మాత్రమే మద్దతుగా నిలవటం చాలా తప్పన్నారు. అప్పులు తీసుకున్న మామూలు ప్రజలకు ఒక న్యాయం, ఆర్ధిక నేరగాళ్ళకు మరో న్యాయమా అంటు మోడీని ఎంపీ నిలదీశారు. మొత్తానికి ఎంపీ రాసిన లేఖను ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నాయి.