ఢిల్లీ పోరులో కేసీఆర్‌తో జ‌గ‌న్?

గ‌త కొద్దికాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం విధివిధానాల‌ను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌డుతుండ‌గా.. .వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, జాతీయ పార్టీల నేత‌లు ఆయ‌న‌కు సంఘీభావం తెలుపుతున్నారు.

అయితే, పొరుగు రాష్ట్రమైన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నుంచి మాత్రం స్పంద‌న రావ‌డం లేదు. ఈ విష‌యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లుపుకొనిపోవాల‌ని సూచించారు.

ఎనిమిదేళ్ల క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని పేర్కొన్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్… ఈ ప్ర‌క‌ట‌న ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్ ఉభయసభల్లోనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీ, అమిత్ షా స్పందించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు కొట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తారా అని మండిపడిన ఉండవల్లి అరుణ్‌ కుమార్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించరా? అని నిలదీశారు.  ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.