తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత?

తాడిపత్రిలో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య పంతాలు చివరకు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తాడిపత్రి-అనంతపురం జాతీయ రహదారి మీద కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిసైడ్ అయ్యారు. ఇంతకీ రామిరెడ్డి ఎవరంటే పెద్దారెడ్డి తండ్రి. సరే విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటే తప్పులేదు. కానీ అందుకు మున్సిపల్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. ఇదే సమయంలో ఆర్ అండ్ బీ శాఖ అనుమతి కూడా తప్పదు.

అయితే ఎంఎల్ఏ మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. మున్సిపల్ అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం ఏమిటంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నియోజకవర్గానికి వైసీపీ నేత పెద్దారెడ్డి ఎంఎల్ఏ అయితే మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కారణంగానే ఏ విషయం తీసుకున్నా ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి.

తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి తన తండ్రి విగ్రహం ఏర్పాటుకు అనుమతి రాదని ఎంఎల్ఏ అనుకున్నట్లున్నారు. లేదా అధికార పార్టీ ఎంఎల్ఏని కాబట్టి ఎవరినీ అడగాల్సిన అవసరం లేదనుకున్నారో తెలీటం లేదు. మొత్తానికి విగ్రహాన్ని తయారు చేయించారు.  జాతీయ రహదారిపై తాను అనుకున్న చోట్ల పెద్ద దిమ్మ కట్టేసి విగ్రహాన్ని తీసుకొచ్చి నిలబెట్టేశారు కూడా. దీంతో ఇదే విషయాన్ని చైర్మన్ ముందు కమిషనర్ కు తర్వాత కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

వివాదానికి ఒకవైపు ఎంఎల్ఏ మరోవైపు చైర్మన్ కాబట్టి కమిషనర్, కలెక్టర్ చేయగలిగిందేమీ లేదు. విగ్రహం ఏర్పాటు ఎప్పుడో తెలీదు కానీ అందుకు ఎంఎల్ఏ ఏర్పాట్లయితే చేసేసుకుంటున్నారు. తమ అనుమతి లేకుండానే విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తానంటు జేసీ మండిపోతున్నారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏమవుతుందో అని జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.