లాయర్లకు తలంటిన న్యాయస్ధానం

లాయర్లకు న్యాయస్థానం ఫుల్లుగా తలంటింది. కోర్టులపైన, న్యాయమూర్తులపైన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దూషించటం, అనుచిత వ్యాఖ్యలు చేయటంపై హైకోర్టు బాగా సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, కేసుల్లో ఇచ్చిన తీర్పులపై కొందరికి ఒళ్ళు మండిపోయి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోర్టు చాలా సీరియస్ అయిపోయింది.

కోర్టు ఆదేశాల  ప్రకారం సీబీఐ కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టులు కూడా చేసింది. వీరిలో ఇద్దరు లాయర్లు మెట్టా చంద్రశేఖరరావు, గోపాలక్రిష్ట కళానిధి కూడా ఉన్నారు. విచారణ సందర్భంగా వీళ్ళిద్దరిపైన కోర్టు తీవ్రంగా మండిపోయింది. లాయర్లుగా ఉండి న్యాయవ్యవస్ధ పైనే ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మిగిలిన వాళ్ళకు కోర్టులో జరిగే విచారణ గురించి, కోర్టు తీర్పుల గురించి, న్యాయవ్యవస్ధ ఔన్నత్యం గురించి తెలియకపోవచ్చు కానీ లాయర్లే అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటంటు కోర్టు ఇద్దరినీ సూటిగా ప్రశ్నించింది. కోర్టులను కించపరుస్తూ కొందరు వీడియోలు కూడా అప్ లోడ్ చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. లాయర్లుగా ఉండి ముందు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసేసి, పోస్టులో పెట్టేసి తర్వాత క్షమాపణలు చెప్పటం ఏమిటంటు మండిపడింది.

మొత్తం మీద ఈ విషయంలో న్యాయస్థానం ఎంత సీరియస్ గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇటీవలే ట్విటర్, ఫేస్ బుక్, యాజమాన్యాలను కూడా ఈ విషయంలో బోను ఎక్కించింది. సీబీఐ కూడా కోర్టు సీరియస్ కావడంతో వేగంగా పనిచేస్తోంది. అయితే మరోవైపు ఇంత చేసినా విచారణలో బాగా డిలే అవుతోంది. ఎందుకంటే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వీరిని విదేశాల నుండి రప్పించటానికి సీబీఐ ఎంతగా ప్రయత్నిస్తున్నా పూర్తిగా సక్సెస్ కావటం లేదు. దీనిపైన కూడా కోర్టు సీబీఐపైన కూడా బాగా సీరియస్ గా ఉంది. అయితే దర్యాప్తు సంస్ధలపై కోర్టు ఎంతగా సీరియస్ అయినా పెద్ద ఉపయోగం ఉండటం లేదు. ఇపుడు అరెస్టయిన వారిలో కొందరు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రమే సీబీఐ అరెస్ట్ చేయగలిగింది.