ప్రభుత్వానికి వైసీపీ ఎమ్మెల్యే శాపనార్ధాలు !

సొంత పార్టీ ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని నేతలతో మాట్లాడుతూ ఆనం చెప్పారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ తర్వాత నామరూపాలు లేకుండా పోయిందట. తమ కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా చేయాలని నియోజకవర్గాన్ని విభజించిన ఒక నేతకూ అదే గతి పట్టిందట. జనం మాట వినకుండా జిల్లాల విభజన చేస్తే అధికారపార్టీకి కూడా అదే గతి పడుతుందని ఆనం చెప్పటం సంచలనంగా మారింది.

నిజానికి చాలాకాలంగా ప్రభుత్వంపైనే  ఆనం బాగా మండిపోతున్నారు. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ళు మంత్రిగా ఉన్నపుడు ఆయన హవా నడిచింది. ఇపుడు జగన్ సర్కారులో ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రభుత్వంపైనే బహిరంగంగానో లేకపోతే మీడియా సమావేశాల్లోనో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వేలెత్తిచూపుతున్నారు.

జిల్లాల పునర్విభజన అంశానికి వస్తే ప్రజాప్రతినిధులను అడగకుండా జిల్లాల పునర్విభజన ఎలా చేస్తారంటు ఆనం ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్న సహేతుకమైందో కానీ ఆచరణలో జరగదు. ఏ ప్రభుత్వం కూడా ప్రతి పనిని ప్రజా ప్రతినిధులనో లేకపోతే జనాలందరినో అడిగి చేయదు. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా అనుకూలంగా వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పేవారు ఎప్పుడూ ఉంటారు. 

మిగతా విషయాలు పక్కన పెడితే జిల్లా విభజన అనేది నేరుగా నాయకులను ప్రభావతం చేసేది కాబట్టి ఆ విషయంలో ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకపోవడం వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఆనం మాత్రమే కాదు జగన్ అంటే పడిచచ్చే ఎమ్మెల్యేలు కూడా జిల్లాల విభజన పట్ల ఉడికిపోతున్నారు.

వైసీపీసర్కారును బెదిరిస్తేనో లేకపోతే శాపనార్ధాలు పెడితేనో ప్రభుత్వం భయపడిపోతుందని అనుకుంటే ఆనం కన్నా అమాయకడు మరొకరుండారు. ఎందుకంటే జగన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన పట్టుదలకు పోతే ఓటమి ని కూడా పట్టించుకోరు. మరి అలా అని జగన్ ఎంత మందిని దూరం  చేసుకుంటారో చూడాలి.