హఠాత్తుగా ప్రత్యక్షమైన అఖిల ప్రియ

చాలా కాలానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కనబడింది. నియోజకవర్గంలో ఆమె కనబడటమే అరుదైపోయింది. హైదరాబాద్, కడపలో భూ ఆక్రమణలు, కిడ్నాపులు, హత్యలకు కుట్ర తదితర కేసుల్లో పూర్తిగా కూరుకుపోయిన అఖిల అసలు నియోజకవర్గంలో కనబడటమే అరుదైపోయింది. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఆళ్ళగడ్డలో ప్రత్యక్షమయ్యారు. రావటం రావటమే ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతోందని, దాన్ని తాను నిరూపిస్తానంటు సవాలు విసరటమే విచిత్రంగా ఉంది.

తాను మంత్రిగా ఉన్న కాలంలో అందరి దగ్గర విపరీతమైన వసూళ్ళకు పాల్పడినట్లు ఆమెకు సోదరుడి వరసయ్యే భూమా కిషోర్ కుమార్ రెడ్డే స్వయంగా ఆరోపించారు. కాంట్రాక్టు పనులను, బిల్లుల చెల్లింపును కూడా కమీషన్లు తీసుకోనిదే ఆమె ఎవరికీ సిఫారసు చేయలేదంటు కిషోర్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అఖిల అవినీతి చిట్టా మొత్తం తన దగ్గరుందంటు మండిపోయారు. భర్త భార్గవ రామ్ ను అడ్డుపెట్టి అఖిల పాల్పడిన అవినీతికి భూమా నాగిరెడ్డి మద్దతుదారులు కూడా బలైపోయినట్లు సోదరుడు రెచ్చిపోయారు.

ఇలాంటి నేపథ్యంలో ఇంకోరి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానంటు అఖిల నియోజకవర్గంలో కనబడటం ఆశ్చర్యమే. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో రోడ్ల వెడల్పు కార్యక్రమం కూడా ఒకటి. ఈ సాకుతో తన తండ్రి, దివంగత ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి కట్టించిన బస్ షెల్టర్ ను అధికారులు కూల్చేశారంటు అఖిల గోల మొదలుపెట్టారు. అయితే రోడ్డు వెడల్పులో భాగంగానే బస్ షెల్టర్  ను కూల్చేశామని అధికారులంటున్నారు.

బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్నందుకు తన తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. అయితే లోకల్ టాక్ ఏమిటంటే పనులు పర్యవేక్షిస్తున్న అధికారులపై దౌర్జన్యం చేయటానికి జగద్విఖ్యాత్ రెడ్డి ప్రయత్నించారట. జరుగుతున్న పనులను వివరించటానికి అధికారులు ప్రయత్నించినా అఖిల తమ్ముడు వినిపించుకోలేదట. దాంతోనే పోలీసులు జగద్విఖ్యాత్ పై కేసు పెట్టారట. మొత్తానికి ఏదో కారణంతో అయినా అఖిల జనాల్లో కనబడ్డారు.