పవన్ రిస్క్ చేస్తున్నాడా?

Bheemla Nayak

‘భీమ్లా నాయక్’ అనూహ్యంగా ఫిబ్రవరి రిలీజ్‌కే ఫిక్స్ అయిపోయింది. వాయిదా పక్కా అనుకుంటుండగా.. ముందు చెప్పిన ప్రకారమే ఫిబ్రవరి 25కే సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో అంతా షాకైపోయారు. ఇది పవన్ అభిమానులకు ఆనందాన్నిస్తూనే ఇంకో పక్క వారిలో ఆందోళనా రేకెత్తిస్తోంది.

మామూలుగా ఫిబ్రవరి పెద్ద సినిమాలకు అంత అనుకూలమైన సీజన్ కాదు. కానీ కొవిడ్ నేపథ్యంలో ఇలా సీజన్లు చూసుకునే పరిస్థితి లేదు. థర్డ్ వేవ్ కారణంగా సంక్రాంతి కళ తప్పిన నేపథ్యంలో ఫిబ్రవరిలో అయినా ప్రేక్షకులు థియేటర్లకు బాగానే వస్తారని భావిస్తున్నారు.

‘డీజే టిల్లు’ లాంటి చిన్న సినిమాకు మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో పవన్ చిత్రానికి వచ్చిన ఇబ్బందేంటని అంటున్నారు. ఈ కోణంలో చూస్తే ఓకే అనిపించొచ్చు కానీ.. పవన్ సినిమా వస్తోందంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఎవరో ఏదో అనుకుంటారని.. జనాలు తప్పుబడతారని జగన్, వైసీపీ నాయకులు తగ్గే రకం కాదు. తమ శత్రువును దెబ్బ తీయడానికి ఏమైనా చేస్తారు. ఆ విషయం ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడే స్పష్టమైంది. టికెట్ల ధరల విషయంలో నెగెటివ్ కామెంట్స్ చేసిన నానిని సైతం వదిలి పెట్టలేదు.

పరోక్షంగా జగన్ సర్కారును విమర్శించిన రచయిత, దర్శకుడు బీవీఎస్ రవితో.. మళ్లీ పాజిటివ్ ట్వీట్ వేయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ‘రిపబ్లిక్’ వేడుకలో సినిమా టికెట్లు, ఇతర విషయాలపై నిప్పులు చెరిగిన పవన్‌ను అంత తేలిగ్గా వదిలిపెడతారా? నైట్ కర్ఫ్యూ ఎత్తేసినా, 50 పర్సంట్ ఆక్యుపెన్సీకి గడువు తీరిందని ప్రస్తుతానికి సైలెంటుగా ఉన్నా.. ‘భీమ్లా నాయక్’ వచ్చే టైంకి ఏం నిబంధనలు పెడతారో తెలియదు.

టికెట్ల ధరల సవరణ అతి త్వరలో అంటున్నారు కానీ.. ‘భీమ్లా నాయక్’కు కచ్చితంగా అవకాశం ఉండకపోవచ్చు. అదే ఏప్రిల్ 1కి సినిమాను ఫిక్స్ చేసి ఉంటే.. అంతకంటే ముందే రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు వస్తాయి కాబట్టి వాటికిచ్చే వెసులుబాటును ‘భీమ్లా నాయక్’కు కొనసాగించని పరిస్థితి ఉండేది. అప్పుడు ఈ చిత్రాన్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టడానికి జగన్ సర్కారుకు అవకాశం ఉండేది కాదు. అప్పటికి టికెట్ల రేట్లు కూడా పెరిగేవి కూడా. ఇవన్నీ చూసుకోకుండా ‘భీమ్లా నాయక్’ను తొందరపడి రిలీజ్ చేసి ఇబ్బందుల్లో పడతారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.