రిలీజ్ గజిబిజి.. ఏం జరుగుతోంది?

కోవిడ్ దెబ్బకు ఏ సినిమా ఎప్పుడొస్తుందో తెలియని అయోమయం నెలకొంది. సినిమాలను మళ్లీ మళ్లీ వాయిదా వేయడం.. రిలీజ్ డేట్లు ముందుకు వెనక్కి జరపడం.. ఒక సినిమా అనుకున్న డేట్‌కు ఇంకోటి రావడం.. ఒక సినిమా కోసం ఇంకోటి త్యాగం చేయడం.. ఇలాంటివన్నీ మామూలు వ్యవహారాలైపోయాయి. సాధ్యమైనంత వరకు సర్దుబాట్లు చేసుకుని సుహృద్భావ వాతావరణంలోనే సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ.. కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులు తప్పట్లేదు.

వేసవికి షెడ్యూల్ అయిన సినిమాల్లో అనుకోకుండా ఆచార్య, ఎఫ్-3 సినిమాల మధ్య క్లాష్ ఏర్పడింది. పోటీ పడి ఒకే వీకెండ్‌కు ఈ సినిమా రిలీజ్ డేట్లను ఖరారు చేశారు. ఐతే తర్వాత ‘ఎఫ్-3’ టీం పోటీ నుంచి తప్పుకుని ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెలాఖరుకు వెళ్లిపోయింది. అలాంటి సర్దుబాట్లు జరుగుతున్న టైంలో ఫిబ్రవరి చివరి వీకెండ్ రిలీజ్‌ల విషయంలో అనవసర గందరగోళం ఏర్పడింది.

ఫిబ్రవరి 25కు ముందు రిలీజ్ ఖరారు చేసుకున్నది ‘భీమ్లా నాయక్’ సినిమా. కానీ ఆ రోజుకు సినిమా విడుదల కావడం కష్టమే అన్నది మొన్నటిదాకా ఉన్న సమాచారం. అధికారికంగా వాయిదా ప్రకటించలేదు  కానీ.. అది లాంఛనమే అనుకున్నారు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గని’ చిత్రాలను ఫిబ్రవరి 25కు ఖాయం చేయడం చూస్తే ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందం నుంచి వాళ్లు క్లారిటీ తెచ్చుకున్నట్లే అనిపించింది.

‘భీమ్లా నాయక్’ వాయిదాకు పవన్ అభిమానులు కూడా మానసికంగా సిద్ధమైపోయే ఉన్నారు. ట్రేడ్ వర్గాల్లో కూడా ‘భీమ్లా నాయక్’పై ఆశలేమీ లేవు. కానీ తీరా చూస్తే మంగళవారం రాత్రి హఠాత్తుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అందరికీ పెద్ద షాక్. ఫిబ్రవరి 25కు రిలీజ్ ఫిక్స్ చేసుకుని ప్రమోషన్లు కూడా చేసుకుంటున్న ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టీం.. అలాగే మంగళవారం మధ్యాహ్నమే రిలీజ్ డేట్ ఇచ్చిన ‘గని’ బృందానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఇక్కడ ముఖ్యంగా మెగా హీరోనే అయిన వరుణ్‌కు ఇది ఎంతమాత్రం రుచించని విషయమే. ఇప్పటికే ఆ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ఇస్తే కొన్ని గంటలు కూడా అది నిలవలేదు. ‘భీమ్లా నాయక్’ వస్తే ‘గని’ వచ్చే అవకాశమే లేదు. దీంతో ‘గని’ టీం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కామెడీగా మారిపోయింది. శర్వానంద్ సంగతెలా ఉన్నా.. కనీసం వరుణ్‌కైనా పవన్ సినిమా మేకర్స్ సమాచారం ఇవ్వాలి కదా.. ఎందుకింత కమ్యూనికేషన్ గ్యాప్.. వరుణ్ చిత్ర బృందాన్నిలా వెర్రివాళ్లను చేయడం ‘భీమ్లా నాయక్’ టీంకు న్యాయమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.